
ఏపీలో మరో కొత్త సంక్షేమ పథకం ప్రారంభమైంది. చేనేతల కోసం నేతన్న సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద చేనేతలకు ఒక్కొ కుటుంబానికి రూ.25 వేల చొప్పున విడుదల చేశారు. ప్రతీ ఏడాది చేనేతలకు రూ.25 వేలు ఈ పథకం ద్వారా అందించనున్నారు. చేనేతలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నేతన్న సేవలో పథకాన్ని చీరాల నియోజకవర్గం కొత్తపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా కొత్తపేట గ్రామంలోని ఓ చేనేత మగ్గం యూనిట్ను సందర్శించారు. చేనేత మగ్గం వద్దకు వచ్చిన ముఖ్యమంత్రికి చేనేత యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. అనంతరం చేనేత కార్మికులతో సీఎం మాట్లాడారు. కుప్పడం పట్టు చీరల ప్రత్యేకత, సంప్రదాయ నేత వృత్తి నైపుణ్యం, మార్కెట్ పరిస్థితులపై వారితో చర్చించారు. వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ ద్వారా కుప్పడం పట్టు చీరలకు మరింత విశిష్టమైన గుర్తింపు లభించిందని, జీఐ ట్యాగ్తో అమ్మకాలు 30 శాతం మేర పెరిగాయని చేనేత కుటుంబాలు సీఎం చంద్రబాబుతో అన్నారు. గత ఏడాది చీరాలలో తయారైన కుప్పడం పట్టు తోపాటు అత్యుత్తమ వృత్తి నైపుణ్యానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడం గర్వకారణమన్నారు
చేనేతల జీవనోపాధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై చేనేత వర్క్షాప్లోని కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వర్క్షాప్ ఏర్పాటుకు దారితీసిన ఆలోచన, యూనిట్ స్థాపన, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించి తీర్చిదిద్దిన తీరు, యూనిట్ ను సమర్ధంగా నడిపిస్తున్న అంశాన్ని వారు సీఎంకు వివరించారు. ముందుగా కంచి బోర్డర్ చీరల తయారీదారు బత్తా ధనుంజయరావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కుటుంబ పరిస్థితులు, చేనేత వృత్తి, ఉత్పత్తి వ్యయం, ఆదాయం, మార్కెటింగ్, విక్రయాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎంతో ఉపయోగపడుతోందని, రూ.25 వేల ఆర్థిక సాయం తమకు ప్రోత్సాహంగా ఉంటుందని వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి బండారు బాలసుబ్రహ్మణ్యంతో కలిసి వర్క్షాప్ లోని తొలి అంతస్తును పరిశీలించారు. భవనాన్ని విస్తరించి మరిన్ని మగ్గాలు ఏర్పాటు చేసి మరింత మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ప్రణాళికలను ఆయన సీఎంకు వివరించారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన విస్తరణ పనులను తిరిగి ప్రారంభించి నున్నట్లు తెలిపారు.
అనంతరం వర్క్షాప్లో పనిచేస్తున్న ఇతర చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. బొడ్డు అరుణ అనే మహిళ మగ్గం పై చీర నేస్తున్న తీరును సీఎం ఆసక్తిగా పరిశీలించారు. ప్రభుత్వం అందించిన రూ.25 వేల ఆర్థిక సాయం తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు మొబైల్ ఫోన్లలో వచ్చిన సంక్షిప్త సందేశాన్ని కార్మికులు ముఖ్యమంత్రికి చూపించారు. ప్రభుత్వ సహకారంతో తమ జీవనోపాధికి భరోసా లభించిందని చేనేతలు సంతోషం వ్యక్తం చేశారు.