
ఏపీలో సొంతిళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి భారీ శుభవార్త అందింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నవారికి కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ నెలాఖరుల్లోగా కొత్త ఇళ్లు మంజూరు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష ఇళ్లు మంజూరు కానున్నాయి. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా వీటిని ఇవ్వనున్నారు. గత ఏడాది డిసెంబర్ వరకు ప్రజల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తులు ఆహ్వానించాయి. దీంతో 10 లక్షల మంది ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా.. అధికారులు పరిశీలించారు. వీరిలో 7 లక్షల మంది అర్హులుగా తేలారు. దీంతో వీరికి విడతల వారీగా పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించి పరిశీలించిన అనంతరం కేంద్రానికి పంపింది. కేంద్రం కూడా మరోసారి రీవెరిఫిషన్ చేపట్టింది. అనంతరం లబ్దిదారులను గుర్తించి జాబితా తయారు చేసింది. ఈ జాబితా ఈ నెలాఖరులో విడుదల చేయనుందని తెలుస్తోంది. కేంద్రం నుంచి ఆమోదం లభించాక రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులు త్వరగా పనులు మొదలుపెట్టేలా చర్యలు చేపట్టనుంది. ఈ పథకం కింద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2.39 లక్షలు ఆర్ధిక సాయం అందించనున్నాయి. మే చివరికల్లా కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే జూన్లో పనులు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర గృహ నిర్మాణశాఖ వద్ద ఫైల్ ఉంది. అక్కడ నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకంలో భాగంగా ఈ కొత్త ఇళ్లను మంజూరు చేస్తోంది. లబ్దిదారుడికి కేంద్రం నుంచి రూ.72 వేలు రానుండగా.. మరుగుదొడ్ల పథకం ద్వారా రూ.39 వేలు అందుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం రూ.1.28 లక్షలను అందించనుంది. స్పర్శ్ విధానంలో వీటిని లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విధానం ద్వారా తొలుత రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేశాక కేంద్రం తన వాటా విడుదల చేయనుంది. అనంతరం లబ్దిదారుడికి ఆర్బీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. గత ప్రభుత్వ హయాంలో 4 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. జాబితాను సిద్దం చేయలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ దరఖాస్తులను స్వీకరించింది. పలుమార్లు దరఖాస్తుల గడువును కూడా పెంచింది.