Andhra Pradesh: ప్రజలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వాటిపై 50 శాతం భారీ రాయితీ..

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఖాళీ స్థలాలపై విధించే పన్నును 50 శాతం తగ్గించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి చట్ట సవరణ చేయగా.. ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది.

Andhra Pradesh: ప్రజలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వాటిపై 50 శాతం భారీ రాయితీ..
Indian Money

Updated on: Apr 22, 2026 | 7:00 PM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్థలాలకు విధించే పన్నులో భారీ మినహాయింపులు ప్రకటించింది. ఈ పన్నుపై రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఖాళీ స్థలాలపై విధించే వేకెంట్ ల్యాండ్స్ ట్యాక్స్‌ను ఏకంగా 50 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణ అనుమతి పొందిన స్థలాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. చట్టబద్దంగా భవన నిర్మాణాలకు అనుమతి పొందిన స్థలాలకు మాత్రమే వీఎల్‌టీ పన్నులో 50 శాతం రాయితీ ఉంటుందని, అనధికార నిర్మాణాలు, చట్టబద్ద అనుమతులు లేకుండా ఉన్న నిర్మాణాలకు రాయితీ సౌకర్యం వర్తించదని స్పష్టం చేసింది.

రూ.30 కోట్ల వరకు లబ్ది

రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్రజలకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల లబ్ది చేకూరనుంది. గ్రామ పంచాయతీలతో పాటు పట్టణాలు, నగర పాలక సంస్థల నుంచి అనుమతి తీసుకున్న అన్ని భవన నిర్మాణాలకు రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల రూ.30 కోట్ల వరకు రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూరుతుందని స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లు లేదా భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకుంటారు. అయితే నిర్మాణం సమయంలో మళ్లీ పన్ను చెల్లించాలంటే భారంతో కూడుకున్న పని. అందుకే ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం.. ఊరట కల్పిస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

వీరికి 50 శాతం రాయితీ ఉండదు..

భవన నిర్మాణాలు లేదా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన రోజు నుంచి ఆక్సుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే తేదీ వరకు పన్ను తగ్గింపు అనేది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అనుమతి తీసుకున్న దగ్గర నుంచి భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పన్ను రాయితీ సౌకర్యం వర్తిస్తుంది. అనుమతుల గడువు ముగిసినా.. గుడువు పొడిగింపు ముగిసే వరకు వర్తిస్తుంది. అయితే కొంతమంది ప్రభుత్వ నుంచి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. ఇలాంటివారికి 50 శాతం రాయితీ అనేది వర్తించదు. అయితే వేకెంట్ ల్యాండ్స్ ట్యాక్స్ రాయితీకి సంబంధించిన చట్ట సవరణ బిల్లును గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించింది. దీంతో తాజాగా ఈ ప్రయోజనాలను ప్రజలకు వర్తింపచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు

Follow Us