ఆంధ్రప్రదేశ్లో NDA కూటమి అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందలు చేస్తూ బంపర్ విక్టరీ నమోదు చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 164 స్థానాల్లో గెలిచి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కాగా గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను వైసీపీ సర్కార్ 2019లో అధికారంలోకి రాగానే పక్కకు పెట్టింది. వాటిని తిరిగి కంటిన్యూ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో ప్రధానమైనది అన్న క్యాంటీన్. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పట్టెడు అన్నం పెట్టే ఉద్దేశంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. 5 రూపాయిలకే పేదలకు, నాణ్యమైన, రుచికరమైన భోజానాన్ని అందించింది. 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగింది. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని పక్కనపెట్టింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో.. మళ్లీ అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి. ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
తన 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు.. తన నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ.. 3వ సారి గెలిచి.. హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.