
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతికి తావులేకుండా ఉండేందుకు గెజిటెడ్ అధికారులకు అగ్రీడ్ లిస్ట్ సిస్టమ్ అమలు చేస్తూ ఉత్తర్వులు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఎలా పనిచేస్తుంటే.. అనుమానాస్పద ప్రవర్తన కలిగిన, నిజాయితీపై విశ్వసనీయమైన ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గెజిటెడ్ అధికారుల పేర్లను ఈ అగ్రీడ్ లిస్ట్ లో చేర్చుతారు. అధికారుల ప్రాథమిక ప్రవర్తన, అందిన సమాచారం, ఫిర్యాదుల ఆధారంగా జీఏడీ, ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా జాబితా రూపొందిస్తారు.
అయితే గుర్తింపు లేని వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు ఉండవని, కేవలం ఆధారాలు ఉన్న విశ్వసనీయ ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చిన ప్రతి విశ్వసనీయత ఫిర్యాదుపై 90 రోజుల్లోగా పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.అలాగే అగ్రీడ్ లిస్ట్లో పేరు నమోదైన అధికారులకు రాబోయే రోజుల్లో ఎలాంటి కీలక, లేదా లూక్రాటివ్ పోస్టింగ్లను కేటాయించరని ప్రభుత్వ క్లారిటీ ఇచ్చింది.
అంతేకాదు ఈ జాబితాలో ఉన్న అధికారుల రోజువారీ నిర్ణయాలు, పనితీరు, జీవనశైలి, వారి పేరిట ఉన్న ఆస్తులపై విజిలెన్స్ వర్గాలు నిరంతరం రహస్య నిఘా ఉంచుతాయని స్పష్టం చేసింది. ఈ అగ్రీడ్ లిస్ట్ ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని.. ప్రతి సంవత్సరం ఈ జాబితాను ప్రత్యేకంగా సమీక్షించి సరికొత్తగా అప్డేట్ చేస్తారని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.