Andhra Pradesh: చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులు సీఐడీకి బదిలీ

|

Oct 13, 2024 | 7:29 PM

సీన్ సీఐడీకి మారింది. చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ పోలీసులు దర్యాప్తు చేస్తోన్న కేసులను సీఐడీకి అప్పగించింది. సోమవారం ఫైళ్లు చేతికి రాగానే ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టనుంది సీఐడీ.

Andhra Pradesh: చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులు సీఐడీకి బదిలీ
Crime Investigation Department
Follow us on

వైసీపీ హయాంలో టీడీపీ ప్రధాన కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయడం కోసం సీఐడీకి అప్పగించింది. విచారణ ఫైళ్లను సోమవారం సీఐడీకి అప్పగించనున్నారు మంగళగిరి డీఎస్పీ.

2021 అక్టోబర్‌ 19న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వైసీపీ నేతలు నందిగాం సురేశ్‌, దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, గవాస్కర్‌తో పాటు పలువురు వైసీపీ నేతలను నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ సహా పలువురిపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు.

ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో కేసుల విచారణ జరుగుతుంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో దేవినేని అవినాశ్‌, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, గవాస్కర్ ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 21 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాస్‌పోర్టు సరెండర్ చేయాలని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సీఐడీ మరిన్ని ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించే అవకాశం ఉంది. అటు రెండు కేసుల్లో నిందితులను సీఐడీ విచారించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..