‘నాలో..నాతో.. వైఎస్సార్’.. విజయమ్మ రచన..

|

Jul 08, 2020 | 9:36 AM

'నాలో..నాతో.. వైఎస్సార్' పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పై ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పుస్తకం రాశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ 37 ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం...

నాలో..నాతో.. వైఎస్సార్.. విజయమ్మ రచన..
Follow us on

‘నాలో..నాతో.. వైఎస్సార్’ పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పై ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పుస్తకం రాశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ 37 ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారంగా ఈ పుస్తకాన్ని రచించారు. మహానేతను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్లు విజయమ్మ తెలిపారు.

ఆత్మీయ ‘శేఖరుడు…’
మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని రచించినట్లు విజయమ్మ తన పుస్తకం ముందుమాటలో రాసుకున్నారు. వైఎస్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా ఎలా ఉండేవారో ఈ పుస్తకంలో క్లుప్తంగా వివరించారు. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా… నిజ జీవితంలో వైఎస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో.. విజయమ్మ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు.

వారి కోసం ఈ ‘నా’ పుస్తకం…

రాబోయే తరాలు కూడా వైఎస్సార్ గురించి తెలుసుకుని, స్ఫూర్తి పొందుతారన్న ఉద్దేశంతోనే ‘నాలో.. నాతో… వైఎస్సార్’ రచనను చేపట్టానని వైఎస్ విజయమ్మ చెప్పారు. వైఎస్సార్ జయంతి అయిన జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల చేయనున్నారు. ఈ పుస్తకాన్నిఎమ్మెస్కో పబ్లికేషన్స్ ముద్రించింది. (జులై 08) బుధవారం నుంచి అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో ఇది లభ్యమవుతుందని ప్రచురణకర్తలు తెలిపారు.