అదుపులోకి వచ్చిన గ్యాస్ లీకేజ్…ఫ్యాక్ట‌రీపై కేసు న‌మోదు

| Edited By: Pardhasaradhi Peri

May 07, 2020 | 11:21 AM

ఇప్ప‌టికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగాలు దిగి ప‌రిస్థితిని కంట్రోల్ చేశాయి.. గ్యాస్ లీకేజీ జరిగిన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామానికి చేరుకున్న బృందాలు

అదుపులోకి వచ్చిన గ్యాస్ లీకేజ్...ఫ్యాక్ట‌రీపై కేసు న‌మోదు
Follow us on

విశాఖలో గ్యాస్ లీకేజి పూర్తిగా అదుపులోనికి వచ్చింది. గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన వారికి ఆసుపత్రులలో చికిత్స చేస్తున్నారు. పలువురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన పరిస్థతి. కేజీహెచ్ తో పాటు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేశారు. గ్యాస్ లీకేజీ బాధితులకు చికిత్స అందించడానికి అన్ని ఆసుపత్రులనూ సమాయత్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం జ‌గ‌న్ హుటాహుటినా విశాఖ ఘ‌ట‌నా స్థ‌లికి బ‌య‌ల్దేరారు.

ఇప్ప‌టికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగాలు దిగి ప‌రిస్థితిని కంట్రోల్ చేశాయి.. గ్యాస్ లీకేజీ జరిగిన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామానికి చేరుకున్న బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. విషవాయువు పీల్చి ఎందరు ఇళ్లల్లో ఉండిపోయారు, వారి పరిస్థితి ఎలా ఉంది వంటి విషయాలను బృందాలు ఆరాతీస్తున్నాయి. తలుపులు పగులగొట్టి మరీ ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాధితుల సంఖ్య భారీగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమ‌వుతోంది.

ఇక‌, జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన సమాచారం అందిన వెంటనే గుంటూరు లో వున్న హోమ్ మంత్రి సుచరిత విశాఖపట్నం కలెక్టర్, మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద కారణాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్, డిజాస్టర్ డీజీ అనురాధలతో మాట్లాడారు.సహాయక చర్యలను, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించిన పోలీసులుకేసు న‌మోదు చేశారు.