టీడీపీకి రాజీనామా.. వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్

| Edited By:

Sep 14, 2019 | 9:27 PM

గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. అంతేకాదు ఈ నెల 18న వైసీపీలోకి చేరేందుకు ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇవాళ రామచంద్రాపురంలో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ.. తన నియోజకవర్గం అభివృద్ధికి చంద్రబాబు సరిగా స్పందించలేదని […]

టీడీపీకి రాజీనామా.. వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్
Follow us on

గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. అంతేకాదు ఈ నెల 18న వైసీపీలోకి చేరేందుకు ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇవాళ రామచంద్రాపురంలో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ.. తన నియోజకవర్గం అభివృద్ధికి చంద్రబాబు సరిగా స్పందించలేదని విమర్శించారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరినా చంద్రబాబు ఏం మాట్లాడలేదని గుర్తు చేశారు. కాకినాడలో జరిగిన మీటింగ్‌లో ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు. ప్రజల అభివృద్ధికి టీడీపీని ఉపయోగించుకున్నానని.. అంతేగానీ తన సొంతానికి టీడీపీని వాడుకున్నానని నిరూపిస్తే ఉరేసుకుంటానని పేర్కొన్నారు. ఇక తోట తీసుకున్న తాజా నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్లైంది.

కాగా గత ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన తోట త్రిమూర్తులు.. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస్ చేతిలో 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటూ వస్తోన్న ఆయన.. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. అంతేకాదు గతంలో టీడీపీలోని కాపు నేతలతో కలసి కాకినాడలో ఓ రహస్య సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాపై సమీక్షించిన సమావేశానికి కూడా తోట హాజరుకాలేదు. ఈ క్రమంలో త్రిమూర్తులను బుజ్జగించేందుకు టీడీపీ పెద్దలు చేసిన రాయబారం కూడా విఫలమైంది. దీంతో తోట త్రిమూర్తులు వెళ్లినా పార్టీకి నష్టం లేదనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ వ్యాఖ్యల వల్ల తాను మనస్తాపం చెందానని ప్రకటించిన తోట.. అందుకే తాను టీడీపీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే వైసీపీలోకి ఆయన చేరికను ఆ పార్టీకి చెందిన పలువురు వ్యతిరేకిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తమ పార్టీ అసంతృప్తులను జగన్ ఎలా బుజ్జగిస్తారో చూడాలి.