ప్రభుత్వం అధికారికంగా మద్యం దుకాణాలు ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈమేరకు శనివారం జీవో విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యాపారులకు ఇవ్వకుండా ప్రభుత్వమే దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ నెలాఖరుకు మద్యం దుకాణాల లైసెన్సు గడువు ముగిసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణపై విధివిధానాలను రూపొందించుకునేందుకు సమయం చాలకపోవడంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు వరకు మద్యం దుకాణాల లైసెన్సు గడువు పెంచింది.
అక్టోబర్ ఒకటో తేదీనుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. కొత్తగా విడుదలైన జీవో ప్రకారం ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మండలాలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో మద్యం దుకాణాల ఏర్పాటుకు అధికారులు స్థలాలను పరిశీలిస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో షాపుల ఎంపికకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఒక్కోషాపుకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమిస్తారు. మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తారు.