ఏపీలో ఇంజనీరింగ్ కోర్సులకు ట్యూషన్ ఫీజులు ఖరారయ్యాయి. కనిష్ఠంగా రూ.40 వేలు.. గరిష్ఠంగా రూ.1.17 లక్షల వరకు నిర్ణయించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతించిన ఇంజనీరింగ్ కాలేజీల్లో 2019-2022 విద్యా సంవత్సరాలకు వర్తించేలా ఈ ఫీజులను ఖరారు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఏఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ టి. రంగారావు నేతృత్వంలో జరిగిన ‘అడ్మిషన్లు, ఫీజుల రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్ఆర్సీ)’ సమావేశంలో ఆయా ఫీజులపై నిర్ణయానికి వచ్చారు.
ద్రవ్యోల్బణం, కాలేజీల ఆదాయ, వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఫీజులు ఖరారు చేశారు. అన్ని కాలేజీలను ఒకేగాటన కట్టకుండా.. వాటి ప్రతిష్ఠ, పనితీరు, మౌలిక సదుపాయాలు, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, జీతభత్యాలు తదితర అంశాలు పరిగణనలోనికి తీసుకున్నట్లు సమాచారం.