వారికి రూ.10వేలు కాదు..రూ. లక్ష ఆర్థిక సాయం..
ముందుగా ప్రకటించిన పదివేల సాయాన్ని ఏకంగా రూ. లక్షకు పెంచింది ఏపీ ప్రభుత్వం. రూ. 10వేలు తీసుకునేందుకు బాధితులు నిరాకరించడంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ దుర్ఘటనలో స్టైరీన్ గ్యాస్ వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 321 మంది బాధితులకు ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ముందుగా ప్రకటించిన పదివేల సాయాన్ని ఏకంగా రూ. లక్షకు పెంచింది ఏపీ ప్రభుత్వం. రూ. 10వేలు తీసుకునేందుకు బాధితులు నిరాకరించడంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన డీడీలను బాధితులకు మంత్రులు ఆస్పత్రిలో అందజేశారు. కోలుకున్న వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు వైద్యులు.
కరోనా లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు ప్రకటించడంతో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ తిరిగి పనులు మొదలుపెట్టిన సమయంలో మే 7వ తేదీన తెల్లవారు జామున మూడున్నర గంటలకు స్టైరిన్ విష వాయువు లీకైంది. కొద్ది నిమిషాల్లోనే ఆర్ఆర్ వెంకటాపురం సహా పలు ప్రాంతాల్లో గాలి విషపూరితంగా మారిపోయింది. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఆ గ్యాస్ కారణంగా కళ్లు, చర్మం మంటలతో మెలకువ వచ్చి.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందిన వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది కలిసి వేగంగా ప్రజల్ని ఆస్పత్రులకు తరలించారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. జరిగిన దుర్ఘటనలో 12 మంది మరణించారు. అందులో కొంత మంది ఆ విష వాయువుల నుంచి తప్పించుకుని దూరంగా పరిగెత్తుతున్న సమయంలోనే ఎక్కడికక్కడ కుప్పకూలి ప్రాణాలు వదిలారు. వందల మంది ప్రజలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.