Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: గనుల శాఖ పూర్వ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై వేటు.. ఏసీబీ విచారణకు ఆదేశం

మొన్న రివ్యూ చేశారు. నిన్న ప్రివ్యూ పిక్చర్‌ చూపించారు. గనుల శాఖలో అవినీతి ఘనులపై చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించిన మర్నాడే...పెద్ద వికెట్‌ పడింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ సస్పెండ్ అయ్యారు. ఇక వాట్‌ నెక్ట్స్‌?

AP News: గనుల శాఖ పూర్వ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై వేటు.. ఏసీబీ విచారణకు ఆదేశం
Venkata Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 02, 2024 | 9:34 AM

గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏపీ సర్కార్‌ సస్పెండ్‌ చేసింది. వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అభియోగాల నివేదికను ఏసీబీకి ప్రభుత్వం పంపించింది. గనులు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు, ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకుండా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా మాజీ డైరెక్టర్‌ వ్యవహరించారని ప్రభుత్వం అభిప్రాయపడింది. సస్పెన్షన్‌ తర్వాత హెడ్‌క్వార్టర్స్‌ విడిచి వెళ్లొద్దంటూ వెంకటరెడ్డికి సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

వెంకటరెడ్డి సస్పెన్షన్‌కు ఒక్క రోజు ముందే….గనుల శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. గత వైసీపీ సర్కార్‌లో గనులను అడ్డగోలుగా దోచుకున్నారన్న సీఎం, దీనిపై ఎలాంటి విచారణ అవసరమో ప్రతిపాదిస్తే..దానిని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామన్నారు. గత ఐదేళ్లలో మైనింగ్‌ అక్రమాలు జరిగాయన్న ముఖ్యమంత్రి….వాటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గతంలో వైసీపీ నేతల బెదిరింపులతో లీజులు వదులుకున్నవారు ఉంటే, వాళ్లను గుర్తించాలన్నారు చంద్రబాబు.

అమరావతి సచివాలయంలో బుధవారం నాడు మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇసుక తవ్వకాల్లో భారీ దోపిడీ, సీనరేజ్‌ వసూళ్లలో ఉల్లంఘనలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్, క్వార్జ్‌లను అక్రమంగా తవ్వి తరలించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. తెర వెనుక ఎవరి పాత్ర ఉందో వెలికి తీయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఖనిజాల అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి విచారణ అయినా జరిపిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక వైసీపీ సర్కార్‌ హయాంలో మైనింగ్‌ శాఖ ఆదాయం భారీగా పడిపోయిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని సమాచారం. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థను బలోపేతం చేయడం తన లక్ష్యమని, ఇందుకోసం గతంలో ఎంతో కృషి చేశామన్నారు చంద్రబాబు. ఏపీఎండీసీకి పూర్వవైభవం తెచ్చేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

గనుల శాఖపై సీఎం రివ్యూ చేసిన మర్నాడే… అవినీతి ఘనుడని ఆరోపణలు వచ్చిన వెంకటరెడ్డి వికెట్‌ పడింది. ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇక ముందు ముందు ఎలాంటి చర్యలు ఉంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..