Corona Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్కులు పెట్టుకుంటేనే కరోనా తీవ్రతను సమర్ధంగా అడ్డుకోగలం..అమెరికా పరిశోధనల్లో వెల్లడి

|

Apr 12, 2021 | 4:20 PM

కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాచింది. వ్యాక్సిన్ వచ్చేసింది ఇంకా అంతా ఫర్వాలేదు అని ప్రజలు ఊపిరి తీసుకున్నంతలో ఒక్కసారిగా జూలు విదిల్చింది కరోనా. రెండో వేవ్ అంటూ విరుచుకుపడుతోంది.

Corona Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్కులు పెట్టుకుంటేనే కరోనా తీవ్రతను సమర్ధంగా అడ్డుకోగలం..అమెరికా పరిశోధనల్లో వెల్లడి
Follow us on

Corona Vaccine: కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాచింది. వ్యాక్సిన్ వచ్చేసింది ఇంకా అంతా ఫర్వాలేదు అని ప్రజలు ఊపిరి తీసుకున్నంతలో ఒక్కసారిగా జూలు విదిల్చింది కరోనా. రెండో వేవ్ అంటూ విరుచుకుపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ పై యుద్ధం మరింత ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తరుణంలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించడం తప్ప మరో మార్గం లేదు. ముఖ్యంగా మాస్క్ విషయంలో. మాస్క్ ధరించడమే శ్రీరామరక్ష అని వైద్య నిపుణులు మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. అమెరికాలో జరిగిన పరిశోధనలో మాస్క్ ధరించడం ద్వారా కరోనా ముప్పును సమర్ధంగా ఎదుర్కోవచ్చని మళ్ళీ స్పష్టం అయింది.

పూర్తి స్థాయిలో మాస్కులు ధరించడం ద్వారా వచ్చే ఆగస్టు నాటికి దాదాపు 14 వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని అమెరికాలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో అంచనా వేశారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమీ ఫర్వాలేదు అని అనుకోవడానికి లేదనీ, మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఆ పరిశోధకులు అంటున్నారు. టీకా వేసుకున్నా సరే.. మాస్క్ ధరించడం అత్యంత అవసరం అని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ సమయంలో మాస్క్ ధరించడం ద్వారా ఎంత మంది ప్రాణాలను కాపాడుకోవచ్చనే అంశంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) ఓ అంచనా వేసింది. దీని ప్రకారం అమెరికాలో కోవిద్ మరణాలు 6,18,523కు చేరుకోవచ్చని లెక్క కట్టింది. ఒకవేళ అమెరికాలో 95 శాతం మంది జనం మాస్క్ ధరిస్తే కనుక.. వీరిలో కనీసం 14వేల మంది ప్రాణాలు కాపాడుకోవచ్చని అంచనా వేసింది. దీంతో కరోనా మరణాల సంఖ్యను 6,04,413కు తగ్గించవచ్చని ఐహెచ్ఎంఈ చెబుతోంది. ఇదిలా ఉంటె, ఆగస్టు నాటికి అమెరికా జనాభాలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ కంటే ముందున్న పరిస్థితులు ఏర్పడటంతో ఈ మరణాల సంఖ్యా 6,97,573కు పెరగవచ్చని ఐహెచ్ఎంఈ అంచనా వేసింది.

వేగంగా వ్యాప్తి చెందే కొత్తరకం కరోనా వైరస్ వెలుగు చూస్తుండటం.. కరోనా మరణాలు పెరిగేందుకు కారణంగా మారుతోందని ఆ సంస్థ చెబుతోంది. బ్రిటన్, బ్రెజిల్ రకానికి చెందిన వైరస్ పై వ్యాక్సిన్ పనితీరు ఇంకా పూర్తిగా తెలియలేదు. అందువల్ల వైరస్ ఉధృతి తగ్గే అవకాశం కనిపించడంలేదని అంటున్నారు. ఇటువంటి సమయంలో టీకా తీసుకున్నాసరే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే అని స్పష్టంగా సూచించింది ఐహెచ్ఎంఈ.
కాగా, అమెరికాలో ఇప్పటివరకూ 3 కోట్ల 11 లక్షల మంది కరోనా బారిన పడగా వీరిలో ఇప్పటిదాకా 5 లక్షల 61 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైరస్ ను ఎదుర్కోవడానికి టీకాలు సమర్ధంగా పనిచేసినా.. మాస్కులు ధరించడం వంటి కోవిడ్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం కూడదని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ హెచ్చరిస్తున్నారు.

Also Read: Coronavirus Pandemic: గట్టిగా అంకెలు లెక్కబెడితే.. కరోనా ఉందో లేదో చెప్పేస్తున్న యాప్.. అయితే.. !

Earthquake: ఇండోనేషియాను కుదిపేస్తున్న వరుస భూకంపాలు.. 8 మంది మృతి.. భారీగా నష్టం