
ఇరాన్పై సైనిక దాడులు కొనసాగిస్తోన్న అమెరికా తాజాగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి సిద్ధమైంది. ఆ దేశాన్ని ఏకాకిని చేయడమే తమ లక్ష్యం అన్నారు ట్రంప్. దీంతొ పాటు ఏ దేశమైనా ఇరాన్తో వ్యాపార సంబంధాలను కొనసాగించినట్లయితే ఆ దేశం తీవ్ర ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్, నగదు బదిలీలు వంటివి ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుననీ ఇరాన్ ను ఏకాకిని చేసి, ఓడిపోయేలా చేయడానికి అమెరికా మిత్రదేశాలన్నీ తమతో కలిసి రావాలని అన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు.
ఇరాన్తో వ్యాపార సంబంధాలు సాగించే దేశాలన్నింటికీ ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. భారత్ ఇరాన్కు వ్యాపార వాణిజ్య భాగస్వామిగా ఉంది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇరాన్తో వ్యాపార లావాదేవీలను భారత్ కాస్త తగ్గించింది. అయితే ట్రంప్ హెచ్చరించినట్లుగా చర్యలు చేపడితే భారత ఎక్స్పోర్టర్లకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్కు భారత్ నుంచి 1.25 బిలియన్ డాలర్ల విలువైన ఎక్స్పోర్ట్స్ వెళ్లాయి. అదే సమయంలో 370 మిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్స్ మనకు టెహ్రాన్ నుంచి దిగుమతి అయ్యాయి. ఇరాన్తో మన వాణిజ్య లావాదేవీలు నామమాత్రంగా ఉండటంతో ట్రంప్ చర్యలు చేపట్టినా భారత్పై తక్కువ ప్రభావం పడవచ్చని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రెండు దేశాల మధ్య ఉన్నది కేవలం క్రూడ్ ఆయిల్ బంధమే కాదు. భారత్ నుంచి బాస్మతీ రైస్, టీ, చక్కెర, ఫ్రెష్ ఫ్రూట్స్, మందులు, మసాలాలు, ప్యాక్డ్ ఆహార పదార్థాలు ఇరాన్ మార్కెట్కు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. మరో వైపు ఇరాన్ నుంచి పిస్తా, డేట్స్, డ్రై ఫ్రూట్స్ మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. ఒక వేళ ట్రంప్ ఆర్థిక చర్యలు చేపడితే భారత ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది.