AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాకు బిగ్ షాక్..? భారత్‌కు శ్రీలంక భారీ భరోసా..! అధ్యక్షుడి కీలక ప్రకటన..!

భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించనివ్వబోమని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం దిస్సనాయకేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, ప్రాంతీయ శాంతి, భద్రతతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.

చైనాకు బిగ్ షాక్..? భారత్‌కు శ్రీలంక భారీ భరోసా..! అధ్యక్షుడి కీలక ప్రకటన..!
Rajnath Singh, Anura Kumara Dissanayake
Balaraju Goud
|

Updated on: Sep 09, 2026 | 7:59 PM

Share

కొలంబో: భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించనివ్వబోమని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం దిస్సనాయకేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, ప్రాంతీయ శాంతి, భద్రతతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. భారత్, శ్రీలంకలు నాగరికత పరంగా సన్నిహిత బంధాన్ని కలిగి ఉన్న దేశాలని ఇరువురు నేతలు పేర్కొన్నారు. సమీప పొరుగు దేశాలు, సముద్ర భాగస్వాములుగా రెండు దేశాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రాంతీయ శాంతి కోసం కలిసి పనిచేయాలని పునరుద్ఘాటించారు.

‘భారత్‌కు వ్యతిరేకంగా మా గడ్డను వాడనివ్వం’

ప్రధానంగా భారత భద్రతకు సంబంధించిన అంశాలపై దిస్సనాయకే కీలక హామీ ఇచ్చారు. భారతదేశ భద్రతా ప్రయోజనాలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు శ్రీలంక భూభాగాన్ని ఉపయోగించుకునే అవకాశం ఎప్పటికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో తన గత సమావేశాలను కూడా ఆయన గుర్తుచేసుకున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ హామీ హిందూ మహాసముద్ర ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

38 ఏళ్ల తర్వాత భారత రక్షణ మంత్రి పర్యటన

రాజ్‌నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనకు మరో ప్రత్యేకత ఉంది. సుమారు 38 ఏళ్ల తర్వాత భారత రక్షణ మంత్రి శ్రీలంకలో పర్యటించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు కొనసాగుతున్న ఈ పర్యటనలో రక్షణ, విదేశాంగ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభ సమయంలో భారత్ అందించిన సహాయం, 2025లో వచ్చిన దిత్వా తుపాను అనంతరం భారత్ చేపట్టిన సహాయక చర్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంక్షోభ సమయాల్లో శ్రీలంకకు భారత్ తొలి స్పందనదారుగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

శ్రీలంక ఎయిర్‌ఫోర్స్‌కు భారత్ కీలక సహకారం

రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచేలా ఇరు దేశాలు మూడు అవగాహన ఒప్పందాలను పరస్పరం మార్చుకున్నాయి. వీటిలో శ్రీలంక వైమానిక దళానికి చెందిన ఆరు L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఆధునీకరణకు సంబంధించిన ఒప్పందం కీలకమైనది. భారత ప్రభుత్వ గ్రాంట్ కింద ఈ అప్‌గ్రేడేషన్ చేపట్టనున్నారు. దీంతో శ్రీలంకలోని కీలక ప్రాంతాల వాయు రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. ఈ ఫిరంగులను గతంలో భారత్ శ్రీలంకకు అందించింది.

అలాగే భారత్-శ్రీలంక నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) మధ్య సహకారం, ఇరు దేశాల నేషనల్ డిఫెన్స్ కాలేజీల (NDC) మధ్య విద్యా సహకారానికి సంబంధించిన ఒప్పందాలు కూడా కుదిరాయి. NCC ఒప్పందం ద్వారా యువ క్యాడెట్ల పరస్పర మార్పిడి కార్యక్రమాలకు మరింత ఊతం లభించనుంది.

హిందూ మహాసముద్రంలో భాగస్వామ్యానికి కొత్త బలం

భారత్-శ్రీలంక రక్షణ సహకారం కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వానికి కీలకంగా మారుతోంది. సముద్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పరస్పర భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడం, సంక్షోభ సమయాల్లో సహకారం పెంచుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ పర్యటనతో భారత్ ‘పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యత’ విధానానికి మరోసారి బలమైన సందేశం ఇచ్చినట్టైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us