Srilanka: బాంబు పేలుళ్ల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు.. విచారణకు హాజరుకావాలన్న కోర్టు..
బాంబు పేలుళ్లు జరుగుతాయన్న సమాచారం ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలతో ఓ దేశ అధ్యక్షుడిపై అభియోగాలు నమోదయ్యాయి. ద్వీప దేశం శ్రీలంకలో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఉగ్ర పేలుళ్ల..
Srilanka: బాంబు పేలుళ్లు జరుగుతాయన్న సమాచారం ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలతో ఓ దేశ అధ్యక్షుడిపై అభియోగాలు నమోదయ్యాయి. ద్వీప దేశం శ్రీలంకలో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఉగ్ర పేలుళ్ల ఘటనలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో కొలంబోలోని మెజిస్ట్రేట్ కోర్టు ఆయనను అనమానితుడిగా పేర్కొంది. విచారణ నిమిత్తం ఈఏడాది అక్టోబరు 14వ తేదీన కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన రహస్య పత్రాల ఆధారంగా కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఉగ్ర దాడుల గురించి అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘె నేతృత్వంలోని ప్రభుత్వానికి ముందే సమాచారం ఉన్నప్పటికీ ఘటనను నివారించలేకపోయిందని ప్రెసిడెన్షియల్ కమిషన్ దర్యాప్తులో తేలింది. 2019వ సంవత్సరంలో మూడు చర్చిలు, కొన్ని హోటల్స్ లో బాంబులు పెట్టేందుకు సహకరించిన వారు ఇప్పటికీ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నాంటూ శ్రీలంక క్యాథలిక్ చర్చి ఆర్చ్బిషప్ మాల్కోమ్ రంజిత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈఘటనలో పోలీసు అధికారులుగానూ ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టగా.. పలువురు ఉన్నతాధికారులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ పేలుళ్లపై నిఘా సంస్థల నుంచి ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ శ్రీలంక మాజీ పోలీసు చీఫ్ పూజిత్ జయసుందరేపై నేరాభియోగాలు నమోదయ్యాయి. రక్షణశాఖ మాజీ కార్యదర్శిపైనా కేసు నమోదైంది. కాగా ఘటన సమయంలో అప్పటి దేశాధ్యక్షుడి సిరిసేన మైత్రిపాలపైనా కోర్టు అభియోగాలు మోపింది.
ఈస్టర్ పండగ పురస్కరించుకుని 2019 ఏప్రిల్ 21న శ్రీలంకలో మూడు చర్చిలో, మూడు లగ్జరీ హోటళ్లలో వరుస పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్ ముఠాతో సంబంధమున్న నేషనల్ తవ్హీద్ జమాత్ అనే స్థానిక ఉగ్రముఠా ఈ దాడికి పాల్పడింది. మొత్తం 9 మంది ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మందికి పైగా గాయపడగా.. ఈఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.