Coronavirus: మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త రకం వేరియంట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం…
శాంతించిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాతో పాటు బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్లలో రోజువారీ కొవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి
శాంతించిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాతో పాటు బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్లలో రోజువారీ కొవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ పలుమార్లు తన ఉనికి, రూపాంతరం మార్చుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరో కరోనా కొత్త వేరియంట్ను దక్షిణాఫ్రికా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ‘సౌతాఫ్రికాతో పాటు బోట్సువానా, హాంకాంగ్ లో కూడా ఈ కొత్త రకం వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఇందులో ఏకంగా 32 ఉత్పరివర్తనాలను మేం గుర్తించాం. మరి ఇన్ని మ్యుటేషన్లు ఉన్న ఈ వైరస్ను ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏమేరకు అడ్డుకుంటాయన్నది అనుమానమే. అయితే ఇప్పటివరకు బి.1.1. 529 వేరియంట్ కారణంగా కేవలం 22 కేసులు మాత్రమే నమోదయ్యాయి ‘ అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) సైంటిస్టులు తెలిపారు.
కాగా ప్రపంచాన్ని గడగడలాడించిన బీటా కరోనా వేరియంట్ మొదటగా దక్షిణాఫ్రికాలోనే బయటపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వైరస్ సోకితే కోలుకోవడం కష్టమని, వ్యాక్సిన్ కూడా చాలా తక్కువ ప్రభావం చూపుతుందని WHO వ్యాఖ్యానించింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఇదే దేశంలో C.1.2 వేరియంట్ కూడా బయటపడిన సంగతి తెలిసిందే.
భారత్ లో హై అలెర్ట్..
కాగా దక్షిణాఫ్రికా బి.1.1. 529 వేరియంట్ పై భారత ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో టెస్ట్ లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.
Also Read:
Coal Mine Accident: సైబీరియా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 11మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు!