
అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పవిత్ర నగరమైన మక్కాలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ దేశాలు ఒక చారిత్రాత్మక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘ఒకరిపై దాడి చేస్తే ముగ్గురిపై దాడి చేసినట్టే’ అనే నిబంధనతో కుదిరిన ఈ మహా కూటమి ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఒప్పందంతో పచ్చిమాసియా, ఆసియా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ‘మక్కా అల్-ముకరమ్మ శిఖరాగ్ర సమావేశం’ (Makkah Al-Mukarramah Summit)లో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్లు అత్యంత కీలకమైన త్రైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు.
అయితే.. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ల మధ్య కుదిరిన ‘మక్కా ఒప్పందం’ (Makkah Deal) అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దశాబ్దాలుగా అమెరికా కనుసన్నల్లో నడిచిన మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ కొత్త త్రిపక్ష కూటమి ఎలాంటి సమీకరణాలకు తెరలేపుతోంది? దీనివల్ల భారత్, ఇజ్రాయెల్ దేశాలపై పడే ప్రభావం ఏంటి? పూర్తి విశ్లేషణ ఇక్కడ చూద్దాం..
పశ్చిమాసియా (West Asia) మారుతున్న భౌగోళిక రాజకీయాల మధ్య సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ దేశాలు కొత్త రక్షణ ఒప్పందాన్ని ప్రకటించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. పవిత్ర నగరమైన మక్కాలో కుదిరిన ఈ ఒప్పందాన్ని భవిష్యత్తులో ‘ఇస్లామిక్ శక్తి కూటమి’గా మార్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ డీల్ వెనుక ఉన్న మర్మమేంటి? దీని ప్రభావం ఎలా ఉండబోతోంది..?
ఈ ఒప్పందాన్ని నాటో (NATO) ఆర్టికల్ 5తో పోల్చలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సౌదీపై దాడి జరిగితే పాక్, టర్కీలు ఆటోమేటిక్గా యుద్ధంలోకి దూకుతాయని దీని అర్థం కాదు. పరిస్థితులు, ఆయా దేశాల రాజకీయ నిర్ణయాలపైనే సైనిక సహకారం ఆధారపడి ఉంటుంది. అత్యవసరమైతే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం, ఆయుధాలు, సైనిక సాయం అందించడం వరకే ఇది పరిమితం కావచ్చని, నేరుగా యుద్ధంలో దిగడం అనేది చివరి ప్రత్యామ్నాయమని విశ్లేషిస్తున్నారు.
సౌదీ అరేబియా అమెరికాతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటోందని అనడంలో అర్థం లేదు. అయితే, పశ్చిమాసియాలో అమెరికా తన ప్రత్యక్ష సైనిక జోక్యాన్ని తగ్గించుకుంటున్న నేపథ్యంలో.. సౌదీ తన భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. టర్కీ, పాక్లతో దోస్తీ కడుతున్నప్పటికీ.. సౌదీ సైన్యం ఇప్పటికీ పూర్తిగా అమెరికా ఆయుధాలు, టెక్నాలజీపైనే ఆధారపడి ఉంది.
భారత్కు నష్టమేంటంటే: ఈ ఒప్పందం వల్ల పాకిస్థాన్కు కొంత రాజకీయ, వ్యూహాత్మక మద్దతు లభించినప్పటికీ.. సౌదీ అరేబియా భారత్కు అత్యంత కీలకమైన వాణిజ్య, ఇంధన (Energy) భాగస్వామిగా ఉంది. కాబట్టి భారత్తో సంబంధాలను పణంగా పెట్టే సాహసం సౌదీ చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ అప్రమత్తత: టర్కీ, పాకిస్థాన్లు ఎప్పుడూ ఇజ్రాయెల్ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త సమీకరణాలపై ఇజ్రాయెల్ తీవ్ర నిఘా పెట్టింది.
యూఏఈ స్టాండ్: ఈ కూటమికి దూరంగా ఉన్న యూఏఈ (UAE).. అమెరికా, భారత్, ఇజ్రాయెల్లతో మరింత బలమైన, సమతుల్యమైన సంబంధాలను కొనసాగిస్తోంది.
మక్కా డీల్ ఇస్తోన్న ప్రధాన సందేశం ఏమిటంటే.. పశ్చిమాసియా దేశాలు ఇకపై పూర్తిగా అమెరికాపైనే ఆధారపడే రోజులు పోయాయి. ప్రాంతీయ దేశాలు తమ భద్రత కోసం స్వయంగా కొత్త భాగస్వామ్యాలను వెతుక్కుంటున్నాయి. అయితే, ఇది నాటో తరహా బలమైన సైనిక వ్యవస్థగా మారుతుందా లేదా అనేది భవిష్యత్తులో తలెత్తే సంక్షోభాల సమయంలోనే తేలనుంది.
ఇరాన్ పార్లమెంట్, జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ సభ్యుడైన ఇబ్రహీం రెజాయీ మక్కా డీల్ పై స్పందించారు. “సంవత్సరాలుగా అమెరికన్లకు ఏకపక్షంగా అండగా నిలవడం వారికి భద్రతను తీసుకురాని విధంగానే, టర్కీ – పాకిస్తాన్లతో కాగితపు ఒప్పందం కూడా వారికి భద్రతను తీసుకురాదని సౌదీలు తెలుసుకోవాలి’’.. అంటూ వివరించారు.
ఇదిలాఉంటే.. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. భారతదేశం మక్కా డీల్ ఒప్పందాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ మరింత వివరాల్లోకి వెళ్లలేదు.
“ఈ పరిణామాన్ని కూడా మేము నిశితంగా గమనిస్తున్నాము, మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాము” అని రణధీర్ జైస్వాల్ అన్నారు.
#WATCH | Delhi: On Somalia and Pakistan signing a defence cooperation pact, MEA Spokesperson Randhir Jaiswal says, “We continue to closely follow the developments between Somalia and the other country that you mentioned. That is what I have to say.”
On Africa Day, he says, “Yes,… pic.twitter.com/EhzXbXyxbw
— ANI (@ANI) August 7, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..