Imran Khan: ఇమ్రాన్ ఖాన్ వక్రబుద్ధి.. తాలిబన్ల కోసం ఇతర దేశాలను దూరం చేసుకుంటున్న పాక్ ప్రధాని

|

Sep 22, 2021 | 10:19 AM

SAARC Foreign Ministers Meet: తాలిబన్లను మొదటి నుంచీ వెనకేసుకొస్తున్న పాకిస్థాన్.. అంతర్జాతీయ వేదికపై తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టింది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ వక్రబుద్ధి.. తాలిబన్ల కోసం ఇతర దేశాలను దూరం చేసుకుంటున్న పాక్ ప్రధాని
Imran Khan
Follow us on

తాలిబన్లను మొదటి నుంచీ వెనకేసుకొస్తున్న పాకిస్థాన్.. ఈ విషయంలో తన వైఖరిని అంతర్జాతీయ వేదికపై  మరోసారి తేటతెల్లంచేసింది.తాలిబన్లకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్థాన్. ఆ దిశగా ఇతర దేశాల మీదా ఒత్తిడి తీసుకొస్తోంది. తాలిబన్లతో బంధం కోసం ఇతర దేశాలతో సంబంధాలను పణంగా పెట్టేందుకు కూడా ఇమ్రాన్ ఖాన్ సర్కారు సన్నద్ధమవుతోంది. సార్క్ దేశాల(దక్షిణాసియా కూటమి) విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆఫ్గనిస్థాన్‌లో తరఫున తాలిబన్ ప్రతినిధికి ప్రాతినిథ్యంకల్పించాలంటూ ఇమ్రాన్ ఖాన్ సర్కారు పట్టుబట్టడమే దీనికి తార్కాణం. అయితే ఈ విషయంలో సార్క్ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సార్క్ వార్షిక సమావేశం రద్దయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు సెప్టెంబర్ 25న ఈ సమావేశం జరగాల్సి ఉంది. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో సార్క్‌ విదేశాంగ మంత్రుల భేటీ ఆనవాయితీగా వస్తోంది. అయితే పాకిస్థాన్ మొండి వైఖరి కారణంగా ఈ సమావేశాన్ని సార్క్ దేశాలు రద్దు చేసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఆఫ్గానిస్థాన్‌లో ఇటీవల తాలిబన్ల ప్రభుత్వం కొలువుదీరడం తెలిసిందే. అయితే పలు దేశాలు అక్కడ తాలిబన్ల పాలనను గుర్తించేందుకు సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలో జరిగే సార్క్ దేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్ ప్రతినిధికి ప్రాతినిథ్యం కల్పించాలంటూ పాకిస్థాన్ పట్టుబట్టింది. అయితే పలు సార్క్ సభ్య దేశాలు పాక్ అభ్యర్థనను తోసిపుచ్చాయి. ఈ సమావేశంలో ఆఫ్గనిస్థాన్ తరఫున అష్రఫ్ ఘని ప్రభుత్వానికి చెందిన ప్రతినిధికి ప్రాతినిథ్యం కల్పించే ప్రతిపాదనను కూడా పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో సార్క్ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహక దేశమైన నేపాల్ ప్రభుత్వం ఓ ప్రకటన వడుదల చేసింది.

సార్క్ దేశాల కూటమిలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్, ఆఫ్గనిస్థాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. అలాగే మరో 9 దేశాలు దక్షిణాసియా కూటమిలో పరిశీలక దేశాలుగా ఉన్నాయి. జపాన్, మొరీషియస్, మయన్మార్, ఈరోపియన్ యూనియన్, ఇరాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా దేశాలు పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో సార్క్‌ విదేశాంగ మంత్రుల భేటీ ఆనవాయితీగా వస్తున్నది. అయితే సార్క్‌ సభ్య దేశాల మధ్య సమ్మతి కొరవడటంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

అందుకే తాలిబన్లకు మద్ధతు: ఇమ్రాన్ ఖాన్

ఆఫ్గనిస్థాన్ విషయంలో పాక్ వైఖరిని సమర్థించుకుంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మానవీయ దృక్పథంతోనే తాలిబన్లకు మద్ధతు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాలిబన్లకు మద్ధతు ఇవ్వకపోతే ఆఫ్గనిస్థాన్‌లో అంతర్గత కుమ్ములాటలు మొదలై మానవీయ సంక్షోభం ఏర్పడే ముప్పు ఉందని వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఆ దేశం నుంచి శరణార్థుల సమస్య నెలకొనే అవకాశముందని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. అలాగే తాలిబన్లు బలహీనపడితే అక్కడ గ్రూపులు ఏర్పడి తీవ్రవాదం పెచ్చుమీరే అవకాశముందన్నారు. ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు బలంగా ఉంటూ అధికారంలో ఉంటేనే శరణార్థుల సమస్య, తీవ్రవాద సమస్య ఉత్పన్నం కాదంటూ ఇమ్రాన్ ఖాన్ తనదైన రీతిలో విశ్లేషించారు.

Also Read..

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో విషాదం.. ఓ కంపెనీ నిర్వాకంతో యువకుడు ఆత్మహత్య..

డెంగ్యూ కొత్త మ్యూటెంట్.. దాదాపు 11 రాష్ట్రాల్లో న్యూ వేరియంట్ కల్లోలం