AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదం నుంచి రాజకీయాల్లోకి.. మసూద్ అజార్ అనుచరుడికి నవాజ్ షరీఫ్ టికెట్!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సన్నిహితుడు పీర్ మజార్ సయీద్ షాకు PML-N రిజర్వ్‌డ్ సీటు టికెట్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆగస్టు 24న జరిగే అజాద్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉలేమా-ఇ-దీన్ స్థానానికి మజార్ పేరు ఖరారైంది. ఆయన గత JeM సంబంధాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. PML-N ప్రభుత్వ ఏర్పాటు వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదం నుంచి రాజకీయాల్లోకి.. మసూద్ అజార్ అనుచరుడికి నవాజ్ షరీఫ్ టికెట్!
Jem Linked Leader Ally Pir Mazhar
Balaraju Goud
|

Updated on: Aug 21, 2026 | 3:12 PM

Share

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైష్‌-ఎ-మొహమ్మద్‌ (JeM) చీఫ్‌ మసూద్‌ అజార్‌ సన్నిహితుడు పీర్‌ మజార్‌ సయీద్‌ షా ఎన్నికల బరిలో నిలిచాడు. నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (PML-N) రిజర్వ్‌డ్‌ సీటుకు టికెట్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 24న జరగనున్న అజాద్‌ జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ రిజర్వ్‌డ్‌ సీట్ల ఎన్నికల్లో ఉలేమా-ఇ-దీన్, మషాయిఖ్‌ స్థానానికి మజార్‌ పేరును PML-N ఖరారు చేసింది.

మజార్‌ సయీద్‌ షా గతంలో అజాద్‌ కాశ్మీర్‌ అసెంబ్లీలో సభ్యుడిగా ఉండటంతో పాటు మంత్రిగానూ పనిచేశారు. 2021లో ఆయన PTI మద్దతుతో రిజర్వ్‌డ్‌ ఉలేమా సీటు ద్వారా అసెంబ్లీలోకి వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకుముందు ఆయనకు జైష్‌-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2021లోనే పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత బిలావల్‌ భుట్టో జర్దారీ, మజార్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇక తాజా ఎన్నికల నేపథ్యంలో 12 రిజర్వ్‌డ్‌ శరణార్థి స్థానాల అంశం కూడా తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. ఈ స్థానాలను రద్దు చేయాలంటూ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (JAAC) ఆందోళనలు చేపట్టగా, అజాద్‌ కాశ్మీర్‌ సుప్రీంకోర్టు మాత్రం ఈ 12 స్థానాలకు రాజ్యాంగ రక్షణ ఉందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం PML-N ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యను సాధించేందుకు రిజర్వ్‌డ్‌ స్థానాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మజార్‌కు టికెట్‌ ఇవ్వడం రాజకీయంగా కీలక వ్యూహంగా భావిస్తున్నారు. అయితే, ఆయన గత నేపథ్యం కారణంగా ఈ నిర్ణయం పాకిస్థాన్‌ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us