PM Modi: భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం.. చప్పట్లతో దద్దరిల్లిన సభ..

అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇటు భారత్ తన నిజమైన స్నేహితుడి గడ్డపై అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం ఘన స్వాగతం పలికింది. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోదీ ప్రసంగిస్తుంటే.. ఎంపీలంతా మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేయడం అందరినీ ఆకర్షించింది.

PM Modi: భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం.. చప్పట్లతో దద్దరిల్లిన సభ..
Pm Modi Address Israeli Parliament

Updated on: Feb 25, 2026 | 9:46 PM

ఇజ్రాయెల్‌ భారత్‌కు నిజమైన స్నేహితుడు అని ప్రధాని మోదీ అన్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ఆయన ప్రసంగించారు. కష్టకాలంలో ఇజ్రాయెల్ భారత్‌కు అండగా నిలిచిందని.. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశం తమ భాగస్వామి అని చెప్పారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి భారత్‌ పూర్తిగా వ్యతిరేకమన్న ప్రధాని.. దశాబ్దాలుగా ఉగ్రవాదంతో భారత్‌ పోరాడుతోందని తెలిపారు. కాగా ఇజ్రాయెల్‌కు మోదీ రావడం సంతోషంగా ఉందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు అన్నారు. మోదీ తనకు సోదరుడిలాంటి వారని అన్నారు.

తొలుత నమస్తే అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అధికార సభ్యులతో పాటు విపక్ష సభ్యులు కూడా ఆయన ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఎంతో కాలం నుంచి స్నేహబంధం ఉందని మోదీ అన్నారు. ఇజ్రాయెల్‌ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తనకు ఆప్తమిత్రుడని మోదీ అన్నారు. భారత ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌ ఎంపీలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పార్లమెంట్‌లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది.

అంతకుముందు ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. టెల్‌అవీవ్‌ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ప్రధాని నెతన్యాహూ స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటిస్తారు. రెండు దేశాల మధ్య 10 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందం జరగనుంది. ముఖ్యంగా ఐరన్‌ డోమ్‌ టెక్నాలజీని అందించేందుకు ఇజ్రాయెల్‌ ముందుకొచ్చింది. తొమ్మిదేళ్ల తరువాత ఇజ్రాయెల్‌‌లో మోదీ పర్యటిస్తున్నారు. ఇరాన్‌-అమెరికా మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న వేళ మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సతీసమేతంగా ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ స్వాగతం పలకడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రోటోకాల్‌ను పక్కనెట్టి నెతన్యాహూ ఎయిర్‌పోర్ట్‌లో మోదీని రిసీవ్‌ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Follow Us