అమెరికా వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. సెక్యూరిటీ బాండ్ తప్పనిసరి! అమలులోకి కొత్త చట్టం..

అమెరికా వెళ్లాలనుకునే విదేశీయులకు కీలక ప్రకటన వెలువడింది. బిజినెస్, టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసే కొందరు విదేశీ పౌరులు ఇకపై 20 వేల డాలర్ల వరకు సెక్యూరిటీ బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. వీసా నిబంధనలను ఉల్లంఘించే వారిని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నిబంధన భారతీయులకు వర్తించకపోయినా.. భవిష్యత్తులో ఇతర దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అమెరికా వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. సెక్యూరిటీ బాండ్ తప్పనిసరి! అమలులోకి కొత్త చట్టం..
US Visa Fee Increased

Updated on: Aug 02, 2026 | 11:57 AM

అమెరికా వెళ్లాలనుకునే విదేశీయులకు కీలక ప్రకటన వెలువడింది. బిజినెస్, టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసే కొందరు విదేశీ పౌరులు ఇకపై 20 వేల డాలర్ల వరకు సెక్యూరిటీ బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. వీసా నిబంధనలను ఉల్లంఘించే వారిని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నిబంధన భారతీయులకు వర్తించకపోయినా.. భవిష్యత్తులో ఇతర దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అమెరికా ప్రభుత్వం వలస విధానంలో మరో కీలక మార్పు తీసుకొచ్చింది. బిజినెస్ (B-1), టూరిస్ట్ (B-2) వీసాల కోసం దరఖాస్తు చేసే కొందరు విదేశీ పౌరులు వీసా పొందే ముందు 20 వేల అమెరికన్ డాలర్ల వరకు సెక్యూరిటీ బాండ్ లేదా డిపాజిట్ చెల్లించాల్సి ఉండే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానుంది.

ఫెడరల్ రిజిస్టర్‌లో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, వీసా అధికారులు అవసరమని భావిస్తే అర్హత ఉన్న దరఖాస్తుదారుల నుంచి బాండ్ కోరే అధికారం కలిగి ఉంటారు. ప్రతి దరఖాస్తుదారుకూ ఇది వర్తించదు. సంబంధిత దేశం, వీసా నిబంధనల అమలు చరిత్ర, ఇతర ప్రమాద సూచికల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఈ నిబంధన 50 దేశాల పౌరులకు వర్తిస్తోంది. ఇందులో అధిక శాతం దేశాలు ఆఫ్రికా ఖండానికి చెందినవే. అలాగే అమెరికా పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే భారతదేశం ప్రస్తుతం ఈ జాబితాలో లేదు. అందువల్ల భారతీయులు ప్రస్తుతం B-1 లేదా B-2 వీసాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ బాండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ఇతర దేశాలను కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

ఈ పథకాన్ని అమెరికా 2025లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే అక్రమంగా ఉండిపోయే వారి సంఖ్యను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. పైలట్ దశలో ఈ విధానం సానుకూల ఫలితాలు ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంటూ, ఇప్పుడు దీనిని శాశ్వత విధానంగా మార్చింది. ఈ నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానంలో భాగంగా భావిస్తున్నారు. గతంలో ఈ పథకంలో 5 వేల, 10 వేల, 15 వేల డాలర్ల బాండ్ ఎంపికలు ఉండేవి. తాజా నిర్ణయంతో 5 వేల డాలర్ల ఎంపికను తొలగించి, గరిష్ట పరిమితిని 20 వేల డాలర్లకు పెంచారు.

ఈ నిబంధన వల్ల వీసా నిబంధనలను పాటించేలా దరఖాస్తుదారులను ప్రోత్సహించవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లేలా ఆర్థిక బాధ్యతను కల్పించడం ద్వారా అక్రమ నివాసాలను తగ్గించడమే లక్ష్యమని వారు పేర్కొంటున్నారు.

అయితే వలస నిపుణులు మాత్రం ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా వ్యాపారం, పర్యాటకం లేదా కుటుంబ అవసరాల కోసం అమెరికా వెళ్లే ప్రయాణికులపై ఇది అదనపు ఆర్థిక భారంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వీసా ఫీజుల పెంపు, సోషల్ మీడియా ఖాతాల పరిశీలన వంటి కఠిన నిబంధనలతో పాటు ఈ బాండ్ విధానం కూడా విదేశీ ప్రయాణికులకు మరో సవాల్‌గా మారే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి, ప్రస్తుతం భారతీయులపై ఈ నిబంధన ప్రభావం లేకపోయినా, అమెరికా వలస విధానంలో జరుగుతున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని వీసా దరఖాస్తుదారులు తాజా నిబంధనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us