
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలపై పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా పాకిస్థాన్లో ఎల్పిజి ధరలు ఆకాశాన్ని తాకాయి. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. పాకిస్థాన్లో గ్యాస్ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గతంలో రూ.3,150 నుంచి 3,968 మధ్య ఉన్న 11.67 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర.. ఇప్పుడు ఒక్కసారిగా రూ.3,900 నుంచి రూ.5,135కు పెరిగింది. కేవలం వంట గ్యాస్ మాత్రమే కాకుండా ఎల్పిజితో నడిచే రిక్షాలు, బస్సులు, మినీబస్సుల ఛార్జీలు కూడా పెరగడంతో రోజువారీ ప్రయాణ ఖర్చులు సామాన్యుడికి భారంగా మారాయి.
పెరిగిన ధరలకు నిరసనగా పంజాబ్ ప్రావిన్స్లోని పలు నగరాల్లో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
ఈ ఇంధన సంక్షోభం వెనుక అంతర్జాతీయ, స్థానిక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీశాయి. ఇరాన్ నుండి పాకిస్థాన్కు వచ్చే గ్యాస్ సరఫరా రోజుకు 10,000 – 12,000 టన్నుల మేర తగ్గిపోయింది. దీనికి తోడు ఈద్, నౌరూజ్ వంటి పండుగల సెలవుల వల్ల రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.
పాకిస్థాన్ వార్షిక ఎల్పిజి అవసరం 2 మిలియన్ టన్నులు కాగా అందులో మెజారిటీ భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నిల్వలు డిమాండ్ను తట్టుకోలేకపోతున్నాయి.
దేశంలో ఇంధన నిల్వలు కేవలం పరిమిత రోజులకు మాత్రమే సరిపడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఇరాన్తో చర్చలు జరుపుతూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మెరుగుపడటం లేదు. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం సద్దుమణగకపోతే, రాబోయే రోజుల్లో పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన గ్యాస్, విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.