అక్కడి పాఠశాలలో వింత వ్యాధి కలకలం.. 100 మందికి పైగా బాలికలు నడవలేని స్థితిలో.. వైరలవుతున్న వీడియో

|

Oct 06, 2023 | 12:30 PM

విద్యార్థుల్లో అంతుచిక్కని రోగంతో అనారోగ్యం కారణంగా స్కూల్‌ని తాత్కాలికంగా మూసివేశారు. అక్కడి అమ్మాయిలంతా స్కూల్లో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం తెలియదు. ప్రయోగశాల పరీక్షలు అధిక ఎలక్ట్రోలైట్ స్థాయిలను సూచించాయని సమాచారం. విద్యార్థుల అనారోగ్యానికి కారణం ఇదేనని ప్రాథమికంగా నిర్ధారించారు వైద్యులు.

అక్కడి పాఠశాలలో వింత వ్యాధి కలకలం.. 100 మందికి పైగా బాలికలు నడవలేని స్థితిలో.. వైరలవుతున్న వీడియో
Kenyan High School
Follow us on

అంతుచిక్కని వింత వ్యాధి అక్కడి విద్యార్థులను అవహించింది. వైద్యులకే సవాల్‌గా మారిన ఈ వింత వ్యాధి దాదాపు 100మంది విద్యార్థులను తీవ్ర అనారోగ్యానికి గురి చేసింది. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో అమ్మాయిలంతా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడి పాఠశాలల విద్యార్థుల అనుభవిస్తున్న వింత వ్యాధి లక్షణాలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటన కెన్యాలోని సెయింట్ థెరిసా ఎరేగి బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థుల్లో అంతుచిక్కని రోగంతో అనారోగ్యం కారణంగా స్కూల్‌ని తాత్కాలికంగా మూసివేశారు. అక్కడి అమ్మాయిలంతా స్కూల్లో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం తెలియదు. కెన్యా ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతోందని ఆఫ్రికా న్యూస్ నివేదించింది. ఈ విద్యార్థుల రక్త నమూనాలను కెన్యా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కెఇఎమ్‌ఆర్‌ఐ)కి పంపి పరీక్షిస్తున్నారు. ఎడ్యుకేషన్ శాఖ, కౌంటీ ప్రభుత్వం, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పిల్లలకు తగిన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నాయని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ జారెడ్ ఒబిరో తెలిపారు.

కొన్ని మీడియా కథనాల ప్రకారం విద్యార్థుల పరిస్థితి క్లిష్ట స్థాయికి చేరుకుందని తెలిసింది. స్థానిక ప్రభుత్వం, పాఠశాలలు పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాయని సమాచారం. తమను ఇంటికి పంపించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారని తెలిసింది. స్కూల్ మేనేజ్‌మెంట్ బోర్డు ప్రకారం, మొదట 80 మంది బాలికలు ఆసుపత్రిలో చేరారు. ఇది ఇప్పుడు 95 కి పెరిగింది. మరికొంత మంది విద్యార్థులకు ఈ వింత జబ్బు లక్షణాలు ఉన్నట్టుగా తెలిసింది.

స్థానిక నివేదికల ప్రకారం, బాధిత విద్యార్థులలో కొంతమంది వివిధ ఆసుపత్రులలో, 30 మంది కాకామెగా ఎలెవెన్ ఫైవ్ హాస్పిటల్‌లో, 20 మంది షిబ్వే లెవల్ ఫోర్ హాస్పిటల్‌లో, 12 మంది ఇగుహు లెవల్ 4 హాస్పిటల్‌లో చేరారు. ప్రాథమిక ప్రయోగశాల పరీక్షలు అధిక ఎలక్ట్రోలైట్ స్థాయిలను సూచించాయని సమాచారం. విద్యార్థుల అనారోగ్యానికి కారణం ఇదేనని ప్రాథమికంగా నిర్ధారించారు వైద్యులు.

ఈ అంతుచిక్కని అనారోగ్యానికి సరైన కారణాలు తెలియకపోయినప్పటికీ కొన్ని నివేదికలు.. ఈ సంఘటనకు “మాస్ హిస్టీరియా” కారణమని పేర్కొన్నాయి. అనారోగ్యానికి సరైన కారణం, కారకం ఏంటనే దానిపై పరిశోధకులు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అనారోగ్యానికి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం, పాఠశాల సిబ్బంది ప్రయత్నిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి