
రష్యాలోని ఉఫా నగరంలో 19 రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతదేహాన్ని గురువారం వైట్ నది పక్కనున్న ఆనకట్టతో పోలీసులు గుర్తించారు. రాజస్థాన్లోని అల్వార్లోని లక్ష్మణగర్లోని కఫన్వాడ గ్రామానికి చెందిన అజిత్ సింగ్ చౌదరి 2023లో MBBS కోర్సు కోసం బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే గత అక్టోబర్ 19న ఉదయం 11 గంటల ప్రాంతంలో పాలు కొనుక్కువడానికి వెళ్తున్నానని చెప్పి అజిత్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడని, కానీ తిరిగి రాలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది, అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిత్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కానీ ఎక్కడా అతని జాడ దొరకలేదు. అయితే అతను మిస్సైన రోజున వైట్ నది ఒడ్డున చౌదరి బట్టలు, మొబైల్ ఫోన్, బూట్లు దొరికినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇది జరిగిన 19 రోజుల తర్వాత వైట్ నది సమీపంలోని ఒక ఆనకట్టలో అతని మృతదేమాన్ని కొందరు స్థానికులు కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాన్ని పరిశీలించి.. అతని స్నేహితుడి ద్వారా అది అజిత్ మృతదేహామేనని నిర్దారించుకున్నారు. తర్వాత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
అయితే అజిత్ మిస్సింగ్పై రష్యాలోని భారత రాయబార కార్యాలయం నుండి తక్షణ ప్రకటన రాలేదు. కానీ వారు గురువారం అతని మృతి చెందినట్టు భారత్లోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ విషయం విన్న ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అజిత్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని వారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కోరారు. దీనిపై స్పందించిన ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడిపై అవాంఛనీయ సంఘటన జరిగింది, దీనినిపై పూర్తి దర్యాప్తు చేయాలి. కుటుంబం ఇకపై మీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.