
ఇజ్రాయెల్లోని జెరూసలేంలో ఓ భారతీయ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. బుధవారం (జూలై 22) కటమోన్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో భారతీయుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన ఇజ్రాయెల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఈ కేసులో ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, మృతుడు భారతదేశానికి చెందిన కార్మికుడు. ఘటనకు సంబంధించి దక్షిణ ఇజ్రాయెల్లోని ఐలాట్ నగరానికి చెందిన 31 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిందితుడికి, మృతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.
మోరియా పోలీస్ స్టేషన్ చీఫ్ కమాండర్ యువల్ రూవెన్ తెలిపిన వివరాల ప్రకారం, అపార్ట్మెంట్లోని ఒక గదిలో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తుండగా, మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని పోస్టుమార్టం నివేదిక అనంతరం నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం మృతుడి వ్యక్తిగత వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని ఇజ్రాయెల్ పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..