PM Modi: ప్రపంచ దేశాలకు భారత్‌ ఓ నమ్మకమైన పార్ట్‌నర్‌గా మారింది.. పారీస్ వేదికగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ నమ్మకమైన భాగస్వాములు, స్థిరమైన సరఫరా గొలుసుల కోసం అన్వేషిస్తున్నాయని, ఈ క్రమంలో భారత్ ఒక విశ్వసనీయమైన గ్లోబల్ పార్ట్‌నర్‌గా అవతరిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే భారత్‌ కేవలం భవిష్యత్తుకోసం సన్నద్దం కావడమే కాకుండా.. దాన్ని స్వయంగా తీర్చిదిద్దుతోందని ఆయన అన్నారు.

PM Modi: ప్రపంచ దేశాలకు భారత్‌ ఓ నమ్మకమైన పార్ట్‌నర్‌గా మారింది.. పారీస్ వేదికగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Pm Modi Paris Speech

Updated on: Jun 19, 2026 | 7:03 AM

ప్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ ఉన్న ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద కలలు కనడానికి భారత యువత భయపడదు.. భారతీయులు ఫ్రాన్స్‌ను మరింత అందంగా చేశారని ఆయన అన్నారు. ఇండియా ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందిందని. భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలు చాలా బలమైనవవి అని ఆయన అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్‌ భవిష్యత్తు కోసం సిద్ధపడడమే కాకుండా, దాన్ని స్వయంగా తీర్చిదిద్దుతోందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అనిశ్చితంగా మారుతున్న నేటి ప్రపంచంలో దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో సమానంగా నమ్మకం కూడా అంతే కీలకమైందని ఆయన  స్పష్టం చేశారు.

ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే నడిచేవని.. కానీ ఇప్పుడు వాణిజ్యంతో పాటు నమ్మకం కూడా ఎంతో ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. ప్రతి దేశం ఒక స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని.. ఇలాంటి కీలక సమయంలో ప్రపంచానికి భారతదేశం ఒక నమ్మకమైన ఆశాకిరణంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.

స్థిరత్వానికి మూలస్తంభం ‘భారత్-ఫ్రాన్స్’ బంధం

ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అనిశ్చితి నెలకొన్న ఈ రోజుల్లో భారత్-ఫ్రాన్స్ సంబంధాలు పరస్పర నమ్మకానికి, సహకారానికి ఒక బలమైన లంగరు లాంటివని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య బంధాన్ని ఈ ఏడాది ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లిందని మోదీ తెలిపారు. నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జరిగిన భేటీని గుర్తుచేస్తూ.. రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్రిటికల్ మినరల్స్, హై-స్పీడ్ రైల్వేల వంటి కీలక రంగాలలో రెండు దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు – సరికొత్త అవకాశాలు

ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతోందని, ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాలతో ఆర్థిక బంధాలు మరింత బలపడుతున్నాయని పీఎం మోదీ తెలిపారు. గత కొన్నేళ్లుగా భారతదేశం అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (FTAs) సంతకాలు చేసిందని ఆయన గుర్తుచేశారు. యూరోపియన్ యూనియన్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్ ఇలా ఏదైనా కావచ్చు, భారత్ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంతో సత్సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. ముఖ్యంగా, వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న భారత్-యూకే (UK) వాణిజ్య ఒప్పందం ద్వారా దేశంలోని రైతులు, కార్మికులు, ఆవిష్కర్తలకు సరికొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us