యుద్ధ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హౌతీ రెబల్స్‌..! వచ్చీ రావడంతోనే..

పశ్చిమాసియాలో 29 రోజులుగా సాగుతున్న యుద్ధంలో యెమెన్ హౌతీ రెబెల్స్ కీలక మలుపు తీసుకున్నారు. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఇజ్రాయెల్ వాటిని అడ్డుకున్నా, హౌతీల ప్రత్యక్ష ప్రమేయం ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచింది. ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హౌతీ రెబల్స్‌..! వచ్చీ రావడంతోనే..
Houthi Rebels

Updated on: Mar 28, 2026 | 11:35 PM

పశ్చిమాసియాలో వరుసగా 29వ రోజు భీకరయుద్ధం కొనసాగుతోంది. యుద్ధంలో యెమెన్‌ హౌతీ రెబల్స్‌ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్‌కు మద్దతుగా హౌతీ రెబల్స్‌ నిలిచారు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ ప్రయోగించారు. హౌతీ రెబల్స్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఈ దాడిని అధికారికంగా ప్రకటించారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులకు నిరసనగా ,ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకున్నామని సరీ చెప్పారు. ఇజ్రాయెల్ లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించినట్లు వెల్లడించారు.తమ లక్ష్యాలు నెరవేరే వరకు దాడులు ఆపబోమని స్పష్టం చేశారు.

ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత హౌతీలు ఇజ్రాయెల్‌ను నేరుగా టార్గెట్‌ చేయడం ఇదే మొదటిసారి. ఇటు ఇరాన్, అటు హమాస్, లెబనాన్‌లోని హెజ్బుల్లా ఇప్పుడు యెమెన్‌లోని హౌతీలు కలవడంతో అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్‌కు ముప్పు పెరుగుతోంది. ఇజ్రాయెల్,అమెరికా దళాలు గాజా, లెబనాన్, ఇరాన్పై ల దాడులు నిలిపివేసే వరకు తాము కూడా వెనక్కి తగ్గమని హౌతీ ప్రతినిధి హెచ్చరించారు. హౌతీలు ప్రయోగించిన క్షిపణులపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పందించాయి. హౌతీ రెబల్స్ ప్రయోగించిన క్షిపణిని తాము గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.నిజానికి ఈ దాడి ఆకస్మికంగా జరగలేదు. మిడిల్​ ఈస్ట్ దేశాలను వణికిస్తున్న ఈ యుద్ధంలో తాము కూడా భాగస్వామ్యం కాబోతున్నామని హౌతీ ప్రతినిధి యాహ్యా సరీ శుక్రవారమే హెచ్చరించారు. సరీ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై ఈ బాలిస్టిక్ క్షిపణి దాడులు జరిగాయి.

యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు, ముడిచమురు రవాణా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు హౌతీలు కూడా ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరిన్ని ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో వరుసగా 29వ రోజు భీకరయుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 19 అమెరికా సైనికులకు గాయాలయ్యాయి. కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌పై కూడా మరోసారి ఇరాన్‌ డ్రోన్లతో దాడులకు దిగింది . ఈ దాడుల్లో ఎయిర్‌పోర్ట్‌ రాడార్‌ వ్యవస్థ ధ్వంసమయ్యింది.

అబూదాబిపై ఇరాన్‌ డ్రోన్ల దాడిలో ఐదుగురు భారతీయులకు గాయాలయ్యాయి. మరోవైపు ఇరాన్‌పై ఒకేసారి 50 యుద్ద విమానాలతో దాడికి దిగింది ఇజ్రాయెల్‌. టెహ్రాన్‌ యూనివర్సిటీ లోని కొన్ని భవనాలు ఈ దాడిలో ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇరాన్‌ అణు కేంద్రాలను కూడా ఇజ్రాయెల్‌ టార్గెట్‌ చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ కింద ఈసారి శత్రువుల F-16 యుద్ద విమానాలను టార్గెట్‌ చేస్తామని ఇరాన్‌ ప్రకటించింది. తమ మౌలిక వసతులపై దాడి చేస్తే శత్రువుల ఇంధన వనరులను సర్వనాశనం చేస్తామని హెచ్చరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us