Golden Toilet: 98 కేజీల గోల్డ్ టాయిలెట్‌ చోరీ.. కేవలం ఐదు నిమిషాల్లోనే మాయం!

పర్యాటకుల సందర్శనార్ధం ప్యాలెస్‌లో ఉంచిన 98 కేజీల బంగారు టాయిలెట్‌ను ఓ దొంగల ముఠా కేవలం 5 నిమిషాల్లో సర్దేసింది. దాని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దొంగలు భారీ సుత్తెల‌తో ఆ టాయిలెట్‌ను ప‌గుల‌గొట్టి అక్కడి నుంచి ఉడాయించారు. 2019 సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన ఈ చోరీ తాలూకు దొంగలు ఇప్పటికీ దొరకలేదు..

Golden Toilet: 98 కేజీల గోల్డ్ టాయిలెట్‌ చోరీ.. కేవలం ఐదు నిమిషాల్లోనే మాయం!
Golden Toilet

Updated on: Feb 25, 2025 | 11:11 AM

లండ‌న్, ఫిబ్రవరి 25: ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హైమ్ ప్యాలెస్‌లో కోట్ల రూపాయల విలువైన గోల్డెన్‌ టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు. ప్యాలెస్‌లో కళాకృతిగా ప్రదర్శనకు ఉంచిన 18 క్యారెట్ల గోల్డెన్‌ టాయిలెట్‌ను దొంగలు చాకచక్యంగా కేవలం 5 నిమిషాల్లోనే సర్దేశారు. దొంగలు భారీ సుత్తెల‌తో ఆ టాయిలెట్‌ను ప‌గుల‌గొట్టి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ చోరీ 2019 సెప్టెంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ కేసు ఆక్స్‌ఫ‌ర్డ్ క్రౌన్ కోర్టులో సోమ‌వారం విచారణకు వచ్చింది. ప్రాసిక్యూట‌ర్లు వివ‌రించారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులపై విచారణ జరిగింది.

ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ‘అమెరికా’ అనే పేరుతో రూపొందించిన ఈ బంగారు టాయిలెట్‌ దక్షిణ ఇంగ్లాండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలవడంతో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది. 2019, సెప్టెంబర్ 14న తెల్లవారుజామున ఐదుగురు వ్యక్తులతో కూడిన దొంగల ముఠా రెండు వాహనాల్లో వచ్చారు. అనంతరం తాళం వేసిన చెక్క గేట్లను పగలగొట్టి ప్యాలెస్ మైదానంలోకి దూసుకెళ్లింది. ప్యాలెస్‌లోని ఓ కిటికీలోంచి లోపలికి చొరబడి, తలుపును పగలగొట్టి, సుత్తితో కొట్టి గోడ నుంచి టాయిలెట్‌ పెకిలించారు. అనంతరం అక్కడి నుంచి 5 నిమిషాల్లో పారిపోయారు. అయితే బంగారు టాయిలెట్‌ను ప‌గుల‌గొట్టడానికి వాడిన సుత్తెల‌ను అక్కడే విడిచివెళ్లారు. ఈ టాయిలెట్‌ కుండీ బ‌రువు సుమారు 98 కేజీలు ఉంటుంది. దీనికి సుమారు ఆరు మిలియ‌న్ల డాల‌ర్లకు బీమా క్లెయిమ్‌ చేసిన‌ట్లు ఆక్స్‌ఫ‌ర్డ్ కోర్టుకు లాయ‌ర్లు తెలిపారు. నిందితులు దానిని అమ్మడానికి చిన్నచిన్న ముక్కలుగా చేసి ఉంటారని ప్రాసిక్యూటర్ జులియ‌న్ క్రిస్టోఫ‌ర్ కోర్టుకు తెలిపారు.

మైఖేల్ జోన్స్ (39), ఫ్రెడ్ డో (36), బోరా గుక్కుక్ (40).. అనే ముగ్గురు వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే తాము నిర్దోషులమని ఈ ముగ్గురు చెప్పగా.. నాల్గవ వ్యక్తి జేమ్స్ షీన్ (39) గతంలో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాడు. దీనిపై గత నాలుగు వారాలుగా విచారణ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.https://tv9telugu.com/world

1475951,1475958,1475981,1476054