
ఇటలీలో కోవిడ్ మృతుల బంధువులు ఆ దేశ ప్రధానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోర్టు మెట్లెక్కారు. మొత్తం 500 మంది కలిసి ఆ దేశ ప్రభుత్వంపై దావా వేశారు. తమకు జరిగిన నష్టానికి రూ.900 కోట్ల పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అయితే వారు వేసిన దావాలో ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటే, ఆరోగ్యశాఖ మంత్రి రోబర్టో స్పెరాంజా, లాంబర్డీ ప్రాంత గవర్నర్ అట్టిలియో ఫొంటానా పేర్లను చేర్చారు. మొదటిసారి కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రభావితమైన దేశాల్లో ఇటలీలో ముందుంది. అయితే ఫిబ్రవరిలో ఆ దేశంలో వైరస్ ఉనికిని గుర్తించగా, ఇప్పటి వరకు 70 వేలకుపైగా కరోనాతో మరణించారు. ఐరోపా పరంగా చూస్తే మృతుల విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచింది.
లాంబార్డీలో వైరస్ తో తీవ్ర ఇబ్బందులకు గురైన బెర్గామో ప్రాంతానికి చెందిన 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్లో వీరంతా ఓ బృందంగా ఏర్పడి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తమకు జరిగిన నష్టంపై పోరాటం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధించడంలో, ఆర్థిక నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ దావాపై ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రి, గవర్నర్ అధికార ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.