
భారత్ పట్ల అవమానకరంగా మాట్లాడని బ్రిటన్ హోంశాఖ మంత్రి సుయేలా బ్రేవర్మన్ తన స్వరం మార్చారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకొనే ప్రయత్నం చేస్తూనే.. భారత్ పై ప్రశంసలు కురినించారు. పొగడ్తలతో భారత్ గొప్పతనాన్ని కీర్తించారు. అలాగే భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకొనేందుకు బ్రిటన్ ఆతృతతో ఉందని పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లో ఇండియా గ్లోబల్ ఫోరం నిర్వహించిన దీపావళి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుయేలా బ్రేవర్మన్ మాట్లాడుతూ.. తాను హోంశాఖ మంత్రిగా.. రెండు దేశాల మధ్య భద్రతా పరమైన సహకారానికి విలువ ఇస్తానని తెలిపారు. ఇరు దేశాల్లోనూ దేశీయంగా ఇది కీలకమైన అంశమని చెప్పారు. అలాగే అంతర్జాతీయంగా ఇండో-పసిఫిక్లో చాలా ముఖ్యమైన విషయమని వెల్లడించారు. బ్రెగ్జిట్ అంటే వీసాలు, వాణిజ్యం విషయంలో యూరోసెంట్రిక్ ఆలోచనా విధానంలో ఉండటం కాదని పేర్కొన్నారు. తాను బ్రిటీష్ ఇండియన్ వర్గానికి చెందినందుకు గర్వపడుతున్నానని వెల్లడించారు. భారత సంతతి ప్రజలు బ్రిటన్కు చేసిన కృషిని ఆమె ప్రశంసించారు. బ్రిటన్ గ్రామాలు, పట్టణాలు, నగరాలు భారతీయుల వలసలతో సుసంపన్నమయ్యాయని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్థికంగా ఇరుదేశాలు కలిసి పనిచేయాల్సిన అవశ్యకత ఉండటంతో.. వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆతృతతో ఉన్నట్లు తెలిపారు.
దీపావళి కార్యక్రమంలో బ్రేవర్మన్ పూర్తిగా సంప్రదాయ కట్టుబొట్టుతో హాజరయ్యారు.భారత్ తన హృదయంలో ఉందని, తన ఆత్మలో ఉందని, తన రక్తంలో కూడా ఉందన్నారు. తన తండ్రి మూలాలు భారత్ లో ఉన్న గోవాలో ఉన్నాయని, తన తల్లి మూలాలు మద్రాస్లో ఉన్నాయని సుయేలా బ్రేవర్మన్ పేర్కొన్నారు.
ఇటీవల సుయేలా బ్రేవర్మన్ మాట్లాడుతూ.. భారత్ తో స్వేచ్చా వాణిజ్యం ప్రమాదకరమని, దీనివల్ల వలసలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. వీసా గడువు తీరిపోయిన తర్వాత బ్రిటన్ లో ఉండిపోతున్న ఇతర దేశ పౌరులతో పోలిస్తే భారతీయులే ఎక్కువుగా ఉంటున్నారన్నారు. ఈ విషయంలో భారత్ కూడా బ్రిటన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..