AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Sanskrit Conference: ప్రపంచ సంస్కృత మహాసభలో “అక్షర-పురుషోత్తమ దర్శనం”పై స్పెషల్ సెషన్

వేదాంత చరిత్రలో మరో కీలక మలుపు…ప్రపంచ సంస్కృత మహాసభలో తొలిసారిగా అక్షర-పురుషోత్తమ దర్శనానికి విశిష్ట సెషన్! భగవాన్ స్వామినారాయణ బోధించిన వేదాంత సిద్ధాంతానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం. నేపాల్‌ భూమి, సంస్కృత పండితులు, శాస్త్రీయ చర్చలు… ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుంది. ఆ డీటేల్స్ ఈ కథనంలో... 

World Sanskrit Conference: ప్రపంచ సంస్కృత మహాసభలో అక్షర-పురుషోత్తమ దర్శనంపై స్పెషల్ సెషన్
World Sanskrit Conference
Ram Naramaneni
|

Updated on: Jul 12, 2025 | 7:45 PM

Share

ప్రపంచంలోని ప్రాచీనమైన భాషలలో ఒకటైన సంస్కృత భాషకు అంకితమైన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గ్యాథరింగ్ ప్రపంచ సంస్కృత మహాసభ (World Sanskrit Conference) ఈ ఏడాది 19వ ఎడిషన్‌గా నేపాల్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభ ప్రతి మూడేళ్లకోసారి ప్రపంచంలోని ఒక దేశంలో జరుగుతుంది. వేలాది మంది స్కాలర్లను ఒకేచోట సమీకరిస్తూ.. సంస్కృత భాష, సాహిత్యం, తత్వశాస్త్రాలపై సుదీర్ఘ చర్చలకు ఇది వేదికవుతుంది.

ఈసారి నేపాల్ రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన ఐదు రోజుల ఈ సదస్సు… మరో విశేషానికి వేదికైంది. నేపాల్‌తో ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తిస్తూ.. భగవాన్ స్వామినారాయణు ప్రకటించిన తత్త్వాలలో అక్షర-పురుషోత్తమ దర్శనానికి (Akshar-Purushottam Darshan) ప్రత్యేక శాస్త్రీయ సెషన్‌ ఏర్పాటైంది. ఇది నేపాల్‌లో మొదటిసారిగా ఈ తత్వశాస్త్రాన్ని విద్యావేత్తల సమక్షంలో అధికారికంగా పరిచయం చేసిన చారిత్రక సంఘటనగా నిలిచింది.

18వ శతాబ్దం చివర్లో భగవాన్ స్వామినారాయణ మూడు సంవత్సరాలకు పైగా నేపాల్‌ యాత్ర చేశారు. ఈ యాత్రలో ఆయన తపస్సు, యోగసాధన, ఆధ్యాత్మిక బోధనలతో నేపాల్‌ భూమిని పవిత్రం చేశారు. ఈ యాత్ర సందర్భంగానే ఆయన అక్షర-పురుషోత్తమ దర్శనం అనే ఆధునిక వేదాంత పాఠాన్ని వ్యక్తపరిచారు. ఇది ఇప్పుడు వేదాంతంలో ఒక ప్రత్యేక పాఠశాలగా గుర్తింపు పొందింది.

జూన్ 28న జరిగిన ప్రత్యేక సెషన్‌లో నేపాల్, భారతదేశం, అమెరికా, చైనా, జపాన్, యూరప్‌ తదితర దేశాల ప్రఖ్యాత సంస్కృత పండితులు పాల్గొన్నారు. ఈ సెషన్‌ను మహామహోపాధ్యాయ స్వామి భద్రేశ్దాస్‌జీ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన రచించిన స్వామినారాయణ భాష్యాలు, ప్రస్థానత్రయి (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు)పై వ్యాఖ్యానాలుగా వేదాంత ప్రపంచంలో విశిష్ట స్థానం పొందాయి.

ప్రతిష్టాత్మక అతిథులు: ఈ సెషన్‌లో పలువురు ప్రముఖ విద్యావేత్తలు, వర్సిటీ వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు:

  • శ్రీ కాశీనాథ్ న్యౌపానే – ప్రపంచ సంస్కృత మహాసభ జాతీయ సమన్వయకర్త
  • ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి – కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఢిల్లీ
  • ప్రొఫెసర్ ముర్లీ మనోహర్ పాఠక్ – లాల్ బహదూర్ శాస్త్రీ సంస్కృత విశ్వవిద్యాలయం
  • ఇతర వర్సిటీల వైస్ చాన్సలర్లు – తిరుపతి, గుజరాత్, నాగపూర్, రాజస్థాన్, ఉజ్జయినీ, కాశీ, తదితర ప్రాంతాల నుండి
  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్ సభ్యులు
  • నేపాల్ సంస్కృత విశ్వవిద్యాలయం, జయతు సంస్కృతం, నేపాల్ పండిట్ మహాసభ వంటి సంస్థల ప్రతినిధులు

శాస్త్రీయ పత్రాలు – సిద్ధాంత వైశిష్ట్యం: ఈ ప్రత్యేక సెషన్‌లో అక్షర-పురుషోత్తమ దర్శనంపై ప్రముఖ పండితులు వివిధ కోణాల్లో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు:

  • డా. ఆత్మతృప్తదాస్ స్వామి – 21వ శతాబ్ద సంస్కృత సాహిత్యంలో స్వామినారాయణ భాష్యాల నిర్మాణ ప్రక్రియపై అధ్యయం
  • డా. అక్షరానందదాస్ స్వామి – భగవద్గీతలో ధర్మతత్వంపై అక్షర-పురుషోత్తమ దృష్టి
  • ఆచార్య బ్రహ్మానందదాస్ స్వామి – పరబ్రహ్మ స్వామినారాయణుని అవతార తత్వం
  • డా. జ్ఞానతృప్తదాస్ స్వామి – వచనామృతంలోని అక్షర-పురుషోత్తమ సిద్ధాంతం
  • ఇతర పండితులు – బ్రహ్మ-ఆత్మ ఏకత్వం, అక్షరబ్రహ్మ తత్వం, గీతా భాష్య విశ్లేషణ, విశిష్టాద్వైతంతో తులనాత్మక అధ్యయనాలు

సెషన్ ముగింపు సమయంలో ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి మాట్లాడుతూ..“అక్షర-పురుషోత్తమ దర్శనం వేదాంతంలో ఒక ప్రత్యేకమైన, మౌలికమైన మానవతాత్మక ఆవిష్కరణ. ఇది వేదపరంపరలో కొత్త వెలుగుల్ని నింపుతుంది” అని కొనియాడారు. ఇదే సందర్భంలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అక్షర-పురుషోత్తమ దర్శనాన్ని అధికారికంగా తమ సిలబస్‌లో చేర్చినట్టు ప్రకటించారు.

స్వామి భద్రేశ్దాస్ తన ముగింపు ప్రసంగంలో నేపాల్ భూమికి భగవాన్ స్వామినారాయణుని పవిత్ర పాదయాత్రతో ఏర్పడిన ఆధ్యాత్మిక పునీతతను గుర్తుచేశారు. అక్షర-పురుషోత్తమ దర్శనం ద్వారా సానాతన వేదిక పరంపరలోకి ఒక కొత్త అధ్యాయం ప్రవేశించిందన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ “ఈరోజు నేపాల్ భూమి అక్షర-పురుషోత్తమ దర్శనాన్ని గౌరవంగా ఆహ్వానిస్తూ, శాస్త్రీయంగా స్థాపన చేయడం సంతోషంగా ప్రకటిస్తున్నాం” అని ప్రపంచ సంస్కృత మహాసభ జాతీయ సమన్వయకర్త శ్రీ కాశీనాథ్ న్యౌపానే వ్యాఖ్యానించారు.

ఈ సదస్సు కేవలం ఒక విద్యా కార్యక్రమం కాదు. ఇది భగవాన్ స్వామినారాయణుడు, వేదాంత తత్త్వాలు, నేపాల్‌ భూమి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి ఒక మైలు రాయి.

వీడియో దిగువన చూడండి…