
టైటానిక్ చుట్టు ఎప్పుడూ విషాదమే, అంతా మిస్టరీయే. దాన్ని చూసేందుకు సాహసికులతో వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ ఇప్పుడు జలసమాధి అయింది. నాడు టైటానిక్లో బలైన వారిలో చాలా మంది సంపన్నులే. ఇప్పడుు టైటాన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారూ అపర కుబేరులే. అసలు మునిగిపోదని ప్రచారం చేసినా టైటానిక్ షిప్ అట్లాంటిక్ మహాసముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఇప్పుడు ప్రశాంతంగా సేదదీరుతోంది. టైటానిక్కు కేవలం 488 మీటర్ల దూరంలో తునాతునకలై టైటాన్ విషాదాన్ని మిగిల్చింది. టైటానిక్ సాహసయాత్రలో మరో విషాదం. మునిగిపోయిన టైటానిక్ శకలాలు చూసేందుకు అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లిన టైటాన్ కూడా మునిగిపోయింది. ఐదుగురి ప్రాణాలు మహాసముద్రం బలితీసుకుంది.
ఇంజినీరింగ్ అద్భుతంగా చరిత్రలో నిలిచిన టైటానిక్ ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో శిధిల నౌకగా మిగిలిపోయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో కేప్ కాడ్కు తూర్పున 1450 కిలోమీటర్లు, కెనడా న్యూఫౌండ్ల్యాండ్లోని సెయింట్స్ జాన్కు దక్షిణంగా 644 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల 3,810 మీటర్లు అంటే 12,500 అడుగుల లోతున టైటానిక్ శిధిలాలు ఉన్నాయి. అట్లాంటిక్ సముద్రంలో అది మునిగిపోయి 111 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ అది ఎంతో మందిని ఆకర్షిస్తూనే ఉంటుంది. సముద్రం లోతులో ఉన్న టైటానిక్ను చూసేందుకు తహతహలాడేవారి సంఖ్య తక్కువేం ఉండదు. అయితే వాళ్లు సాధారణ జనం కాదు, అపర కుబేరులు.
అలా టైటానిక్ శకలాలు చూసేందుకు వెళ్లిన టైటాన్ సముద్రంలో పేలిపోయింది. టైటానిక్ను చూడాలనుకొని అందులో అందులో ప్రయాణించిన ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ శకలాలు చూసేందుకు ఐదుగురు ప్రయాణికులతో కూడిన టైటాన్ గత ఆదివారం బయలుదేరింది. ప్రయాణం మొదలైన కాసేపటికే ఈ సబ్మెర్సిబిల్ కమ్యూనికేషన్స్ తెగిపోయాయి. అది జరిగిన సమయంలో సముద్రంలో భారీ శబ్దాలను గుర్తించినట్టు అమెరికా నౌకాదళం తెలిపింది. కాని, ఈ సమాచారాన్ని గురువారం వరకు వెల్లడించలేదు. కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ ద్వీపంలో చేపట్టిన భారీ సెర్చ్ మిషన్ తర్వాత ఈ సబ్ మెర్సిబుల్ ప్రమాదాన్ని నిర్ధరించారు. దీన్ని గుర్తించేందుకు ఐదు రోజులు పట్టింది.
టైటానిక్ ఓడకు 488 మీటర్లు దూరంలో టైటాన్ శికలాలు రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో గుర్తించారు. దురదృష్టాన్ని మోసుకొని సముద్రం అడుగుకు బయలుదేరిన ఈ సబ్లో ఐదుగురు ప్రయాణించారు. 48 ఏళ్ల బ్రిటీష్- పాకిస్థాన్ బిలియనీర్ ప్రిన్స్ దావూద్, ఆయన కుమారుడు 19 ఏళ్లు సులేమాన్, బ్రిటీష్ సంపన్నుడు హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ టూరిసిట్ పాల్ హెన్సీ నర్జియోలెట్, ఈ యాత్ర నిర్వహక కంపెనీ ఓషన్ గేట్ CEO స్టాక్టన్ రష్ ఉన్నారు. సముద్ర గర్భంలో పరిశోధనల బృందానికి డైరెక్టర్గా పనిచేసిన పాల్, టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని 37సార్లు సందర్శించారు. ఎన్నోసార్లు చూసిన టైటానిక్ను మళ్లీ చూడటానికి వెళ్లి హెన్సీ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.
అత్యధిక నీటి పీడనం కారణంగానే టైటాన్ పేలిపోయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి నీటి ఒత్తిడి తట్టుకునేలా జలాంతర్గాముల నిర్మాణం ఉంటుంది కాబట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. కమ్యూనికేషన్ తెగిపోయినప్పుడు టైటాన్ సబ్ మెర్సిబిల్ సముద్రమట్టానికి 3500 మీటర్ల దిగువ ఉన్నట్టు భావిస్తున్నారు. అంత లోతులో ఉన్నప్పుడు ఆ సబ్పై నీటి బరువు 10 వేల టన్నులు ఉంటుంది. ఈ బరువు ఐఫిల్ టవర్ బరువుతో సమానం. టైటాన్కు పగుళ్లు లేదా లోపాలు ఏమైనా ఉంటే బయటి నుంచి కలిగే పీడన తీవ్రత దానిపై పడుతుంది. జలంతర్గామి బద్ధలైతే అది గంటకు 2414 కిలోమీటర్ల వేగంతో లోపలికి వెళ్తుంది. అంటే సెకనను 671 మీటర్లన్న మాట. ఇవన్నీ లెక్కలు బట్టి చూస్తే టైటాన్ సబ్ బద్ధలవడానికి మిల్లీ సెకన్ సమయం మాత్రమే పట్టి ఉంటుంది. టైటాన్ లోపల గాలి హైడ్రోకార్బన్ ఆవిరితో అధిక సాంద్రత కలిగి ఉంటుంది. పీడనానికి టైటాన్ పైభాగం పేలిపోయినప్పుడు అందులో ఉన్న హైడ్రోకార్బన్ ఆవిరితో కూడిన గాలి స్వయంచాలకంగా మండుతుంది. టైటాన్ విషయంలో ఇదే జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు అందులో ఉన్న మనుషులు కాలి బూడిదైపోతారు.
కార్బన్ పైబర్, టైటానియం లోహాంతో టైటాన్ను నిర్మించారు. కార్బన్ ఫైబర్ చాలా కఠినంగా ఉంటుంది. విమాన రెక్కలు, రేసింగ్ కార్ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. టైటన్ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు కార్బన్ ఫైబర్ మిడ్ సెక్షన్ కీలకం కానుంది. టైటాన్ శిధిలాల ఫొటోలు తీయడం, సముద్రం అడుగులో ఉన్న ఆ శిధిలాలను బయటకు తెచ్చిన తర్వాత దర్యాప్తు మొదలుకానుంది. అత్యాధునిక యంత్రాలతో నిర్వహించే పరీక్షల ద్వారా టైటాన్ సబ్కు పగుళ్లు ఏమైనా ఏర్పడ్డయా, అందులో లోపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోగలుగుతారు.
వాస్తవానికి ఓషన్గేట్ సంస్థ తాము డిజైన్ చేసిన టైటాన్ అత్యంత సురక్షితమని ప్రచారం చేసింది. ఐదుగురిని తీసుకెళ్లగల కలిగిన టైటాన్ సబ్ మెర్సిబల్ సముద్రంలోపల 4వేల మీటర్లు అంటే 13,120 అడుగులు లోతు వెళ్లగల సామర్ధ్యం కలిగి ఉంది. దీని బరువు 9525 కిలోలు. పొడవు 22 అడుగులు అంటే 6.7 మీటర్లు గంటకు 3 నాట్స్ అంటే మూడున్నర మైళ్ల వేగంతో ప్రయాణించగలరు. దీంట్లో శక్తిమంతమైన LED లైట్లు, సోనార్ నేవిగేషన్ సిస్టమ్, అత్యాధునిక కెమెరా పరికరాలతో పాటు ఐదుగురు వ్యక్తులు 96 గంటల పాటు సజీవంగా ఉంచేందుకు కావాల్సిన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. మొత్తానికి టైటానిక్ ఒక విషాదమనుకుంటే ఇప్పుడు 111 ఏళ్ల తర్వాత మరో విషాదాన్ని మిగిల్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..