అమెరికాలో కార్చిచ్చుకారణమైన మహిళ అరెస్ట్ వీడియో
అమెరికాలోని ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో గతవారం మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ చల్లారలేదు. 4 వేల ఎకరాల్లో అటవీ సంపద కాలి బూడిదయినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కరోలినా లోని మిర్టిల్ బీచ్కు చెందిన 40 ఏళ్ల అలెగ్జాండ్రా బియలౌసౌ అనే మహిళే ఈ మంటలకు కారణమని గుర్తించామని తెలిపారు. వేల ఎకరాల అటవీ సంపద, నివాసగృహాలను ప్రమాదంలో పడేశారని ఆరోపిస్తూ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఏప్రిల్ 15న ఆమె హోరీ కౌంటీ కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. దోషిగా తేలితే అలెగ్జాండ్రాకు కోర్టు 30 రోజుల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తుందని అన్నారు. దక్షిణ కరోలినా ఫారెస్ట్రీ కమిషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోవింగ్టన్ లేక్స్ సబ్ డివిజన్లోని ఓ చెట్టు వద్ద అలెగ్జాండ్రా మంట పెట్టింది. అది పక్కనే ఉన్న ఇతర ప్రదేశాలకు వ్యాపించింది. అయితే మంటలను ఆర్పడానికి ఆమె ప్రయత్నం చేసినప్పటికీ తగినన్ని నీరు లేకపోవడంతో అవి అదుపుకాలేదు. అప్పటికే వేగంగా వ్యాపిస్తూ..పక్కనే ఉన్న వాకర్ వుడ్స్ యాజమాన్యంలోని వృక్షాల మీదుగా మిర్టిల్ బీచ్ సమీపంలోని పలు నివాసాలకు అంటుకున్నాయి. మంటలు 55 శాతం అదుపులోకి వచ్చినట్లు అధికారులు అన్నారు. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని పొడి వాతావరణ పరిస్థితులు ఈ కార్చిచ్చుకు మరింత ఆజ్యం పోయడంతో.. 4 వేల ఎకరాలకు పైగా కాలిపోయాయి. దీంతో ఆ ప్రాంతాలలోని ప్రజలను ఖాళీ చేయించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం :