బాబోయ్‌.. తరుముకొస్తున్న మరో ప్రాణాంతక వ్యాధి.. వైద్యశాఖ హెచ్చరిక

బాబోయ్‌.. తరుముకొస్తున్న మరో ప్రాణాంతక వ్యాధి.. వైద్యశాఖ హెచ్చరిక

Samatha J

|

Updated on: Jan 28, 2025 | 2:07 PM

మరో ప్రాణాంతక మహమ్మారి మారణహోమం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో వెలుగు చూసిన గులియన్-బారే సిండ్రోమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పూణెలో తొలి మరణం కూడా సంభవించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. పూణే కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న గులియన్-బారే సిండ్రోమ్ బ్యాక్టీరియా కారణంగా తొలి మరణం సంభవించినట్లుగా అనుమానిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. జీబీఎస్‌ వ్యాధి లక్షణాలతో జనవరి 9న ఆసుపత్రిలో చేరిన ఓ రోగి పూణే క్లస్టర్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జీబీఎస్‌ మహమ్మారి కేసుల సంఖ్య 101 కి పెరిగింది. వీరిలో 28 మందికి ఇన్ఫెక్షన్‌ ఉందని ధృవీకరించారు

ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో 16 మంది ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో దాదాపు 19 మంది రోగుల వయసు తొమ్మిదేళ్ల కంటే తక్కువ ఉండటం ఆందోళన కలిగించే అంశం. 50 నుంచి 80 ఏళ్ల వయస్సు వారు 23 మంది వరకు ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగుల నుండి సేకరించిన కొన్ని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా.. అందులో క్యాంపిలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడైంది . GBS వ్యాధి ప్రపంచంలో మూడవ వంతు మరణాలకు కారణమవుతుంది. ఇది అత్యంత తీవ్రమైన అంటువ్యాధులలో ఒకటి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కేసులు అధికంగా నమోదవుతున్న పూణేలోని పలు ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరిస్తున్నారు. పూణేలోని ప్రధాన నీటి నిల్వ ప్రాంతమైన ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని ఓ బావిలో ఈ.కోలి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు శనివారం విడుదలైన ల్యాబ్‌ టెస్ట్‌ ఫలితాలలో తేలింది. అయితే ఆ బావిని అసలు వినియోగిస్తున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు.