కట్నం వద్దు.. వధువే ముద్దు..వీడియో
సమాజంలో వరకట్న వేధింపులు ఆందోళన కలిగిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఓ యువకుడు పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పెళ్లి కానుకగా అత్తమామలు ఇచ్చిన లక్షల రూపాయల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించి, వధువే తమకు అసలైన కానుక అని చాటి చెప్పాడు. ఈ సంఘటన హరియాణాలోని కురుక్షేత్రలో జరిగింది. ఉత్తరప్రదేశ్, సహారన్పూర్ జిల్లాలోని భాబ్సి రాయ్పుర్ గ్రామానికి చెందిన వికాస్ రాణా వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన తండ్రి శ్రీపాల్ రాణా గతంలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున యూపీలోని కైరానా లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు.
వికాస్కు, హరియాణాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్తో వివాహం నిశ్చయమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం, ఏప్రిల్ 30న వికాస్ రాణా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కురుక్షేత్రకు చేరుకున్నారు. అక్కడి ఓ హోటల్లో వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుకలో భాగంగా తిలకం కార్యక్రమం జరుగుతుండగా, వధువు తల్లిదండ్రులు వరుడు వికాస్ రాణాకు సంప్రదాయం ప్రకారం రూ. 31 లక్షల నగదును కట్నంగా అందజేశారు. అయితే, ఆ భారీ మొత్తాన్ని స్వీకరించేందుకు వికాస్ వినయంగా నిరాకరించారు. తమకు కాబోయే కోడలు అగ్రికా తన్వరే అసలైన కానుక అని, అంతకు మించిన కట్నం తమకు అవసరం లేదని వికాస్ తండ్రి స్పష్టం చేశారు. వరుడి అభీష్టం మేరకు, కేవలం ఒక రూపాయి నాణెం, కొబ్బరికాయతో సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతును పూర్తి చేశారు. వరకట్నం కోసం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వికాస్ రాణా తీసుకున్న ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇది సమాజానికి ఒక మంచి సందేశమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్జీపీటీ ‘ఓకే’ అంటేనే..

