అమెరికాకు చెందిన ‘జెన్కో పికార్డీ’ అనే కంటైనర్ నౌకను లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో ప్రయాణిస్తున్న ఈ నౌకపై డ్రోన్తో బాంబులు జారవిడిచారు. దీంతో కొంతభాగం ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న భారత నౌకాదళం తక్షణమే స్పందించింది. దానికి సమీపంలోనే విధులు నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ విశాఖపట్నంను ఘటనా స్థలానికి పంపించి సాయమందించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘‘బుధవారం రాత్రి 11.11 గంటల సమయంలో మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ‘ఎంవీ జెన్కో పికార్డీ’ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. సాయం కావాలని దాని నుంచి అభ్యర్థన వచ్చింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో యాంటీ-పైరసీ ఆపరేషన్లో ఉన్న మన డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే స్పందించింది. అర్ధరాత్రి తర్వాత జెన్కో పికార్డీ నౌక వద్దకు చేరుకుని సాయం అందించింది’’ అని నౌకాదళం ఎక్స్ ఖాతాలో తెలిపింది.
దాడి సమయంలో అమెరికా నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది భారతీయులు. ఘటనలో వీరికి ఎలాంటి హనీ జరగలేదని, మంటలు అదుపులోకి వచ్చినట్లు నేవీ తెలిపింది. ప్రస్తుతం నౌక సురక్షితంగా ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టిందని తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి నిరసనగా హౌతీలు ఈ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా నౌకలనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. అటు అగ్రరాజ్యం కూడా చర్యలకు దిగింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై క్షిపణి, వైమానిక దాడులు జరుపుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos