
Vizianagaram Train Accident: విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం నివాళులర్పించారు. విజయనగరం చేరుకున్న సీఎం జగన్ కంటకాపల్లి దగ్గర రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా.. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. 100కి పైకి బాధితులకు గాయాలయ్యాయి. విజయనగరం సహా విశాఖపట్నంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రమాదంలో 7 బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్ను తీసుకొచ్చి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. రాత్రి నుంచి 7 సహాయ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణను వేగవంతం చేశారు.
పలాస ప్యాసింజర్లోని 11 బోగీలను అలమండ స్టేషన్కు, రాయగడ ప్యాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్కు తరలించారు. సహాయ చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బందితో పాటు NDRF, SDRF, RPF, పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఘటనాస్థలి దగ్గర రెండు అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు.
మరోవైపు రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ జరగుతోంది. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ-రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ రైలు సిగ్నల్ను ఓవర్షూట్ చేసినట్టు అనుమానిస్తున్నారు. డెడ్స్లోగా వెళ్లాలన్న సిగ్నల్ను గమనించని లోకోపైలట్.. వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం లేదంటున్న నిపుణులు చెప్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..