AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ అధికారులు.. శతాబ్దాల నాటి రహస్యాలు వెలుగులోకి!

శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ అధికారులు.. శతాబ్దాల నాటి రహస్యాలు వెలుగులోకి!

Phani CH
|

Updated on: Jun 24, 2026 | 11:43 AM

Share

నల్లమల, లంకమల, శేషాచలం అడవుల్లో ఏఎస్ఐ నిర్వహిస్తున్న సర్వేల్లో శతాబ్దాల నాటి అరుదైన శాసనాలు, చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగర సామ్రాజ్యం కాలానికి చెందిన శిలాశాసనాలతో పాటు శ్రీశైలం, గుడిమల్లం ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలిపే వివరాలు లభించాయి. ఈ చారిత్రక సంపదను డిజిటలైజ్ చేసి ‘భారత్ శ్రీ’ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.

దట్టమైన అడవులు, వన్యప్రాణుల అభయారణ్యాల మధ్య దాగివున్న చారిత్రక సంపదను, శతాబ్దాల నాటి నిజాలను వెలికితీసేందుకు భారత పురావస్తు శాఖ నడుం బిగించింది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో నల్లమల, లంకమల, శేషాచలం అడవుల్లో ఏఎస్ఐ బృందం విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తోంది. మైసూర్ ఆర్కియాలజీ జాయింట్ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో సాగుతున్న ఈ అన్వేషణలో ఎన్నో అద్భుతమైన చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఈ చారిత్రక ప్రదేశాలను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శేషాచలం అడవుల్లోని సదాశివకోనలో ఏఎస్ఐ జరిపిన సర్వేలో రాతి శిలలపై 16వ శతాబ్దపు విజయనగర సామ్రాజ్యం నాటి అరుదైన శాసనాలు లభించాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల ప్రాచీన లిపిలో ఉన్న ఈ శాసనాలను అధికారులు విశ్లేషించారు. ముఖ్యంగా 1471వ సంవత్సరం నాటి ఒక ప్రత్యేక శాసనాన్ని అధికారులు కాపీ చేశారు. ఈ శాసనాల్లో 3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ‘గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి’ ఆలయ ప్రాశస్త్యం, అక్కడ జరిగిన నిత్య పూజలు, నైవేద్యాలు, ఆలయ వైభవానికి రాజులు ఇచ్చిన భూదానాల వివరాలు లభించాయి. అలాగే సదాశివకోనలోని పుష్కరిణి నిర్మాణ విశేషాలు, పరమశివుడు ఉగ్రరూపంలో నృత్యం చేస్తున్న అరుదైన శిల్ప ఆకారం కూడా ఈ శిలాశాసనాలపై చెక్కబడి ఉండటం విశేషం. నల్లమల అడవుల్లో జరిపిన పరిశోధనల్లో దాదాపు 38 చారిత్రక శాసనాలు లభ్యమయ్యాయి. వీటి ప్రకారం.. ఒకటో శతాబ్దానికి ముందు నుంచే నల్లమలలో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం ఉన్నట్లు పురావస్తు శాఖ స్పష్టం చేసింది. పల్లవులు, కాకతీయుల కాలంలో జరిగిన ఆలయ అభివృద్ధితో పాటు, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి మహానాయకులు శ్రీశైలాన్ని దర్శించుకున్నట్లు ఈ శాసనాలు చాటిచెబుతున్నాయి. అంతేకాదు, ఇక్కడ 2వ శతాబ్దం నాటి శాతవాహనుల పాలన ఆధారాలు, ఆదిమానవుల ఆవాసాల సాక్ష్యాలు కూడా బయటపడ్డాయి. కాలగర్భంలో కలిసిపోతున్న దేశ సంస్కృతి, చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘భారత్ శ్రీ’ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86,000 ప్రాచీన శాసనాలను గుర్తించారు. వీటిని డిజిటలైజ్ చేసి, భవిష్యత్తులో పరిశోధకులకు, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ‘భారత్ శ్రీ’ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు ఏఎస్ఐ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మదొంగా.. నువ్వు మామూలోడివి కాదురోయ్‌.. ముక్కంటి హుండీకే కన్నమా?

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. స్మోకింగ్ చేస్తే భారీ జరిమానా.. జైలు శిక్ష !

వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్‌.. ఒకే సారి మూడు భారీ చేపలు.. ధరతెలిస్తే షాకవుతారు

Samantha: ‘నా బిడ్డే నా ప్రపంచం..’ పుట్టబోయే బిడ్డపై సమంత ఎమోషనల్ కామెంట్స్

నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం!

Follow Us