అనుమతి లేకుండా మామిడి చెట్లు నరికేశారు.. ఆరేళ్ళ తర్వాత నిందితులకు 2.66 కోట్ల జరిమానా.. ఎక్కడంటే..
చెట్లు ప్రగతికి మెట్లు.. చెట్లు పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అంటూ ఓ వైపు ప్రభుత్వాలు, పర్యావరణ ప్రేమికులు చెబుతుంటే.. మారోవైపు వివిధ కారణాలతో చెట్లను నరికివేస్తున్నారు. అలా అనుమతి లేకుండా మామిడి చెట్లను నరికివేసినందుకు కోట్ల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసు 2019 నాటిది. ఐదుగురు నిందితులపై రూ.2.66 కోట్ల చార్జిషీట్ దాఖలు చేశారు.

ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా 17 మామిడి చెట్లను నరికివేశారు. ఈ ఘటనపై దాదాపు 6 సంవత్సరాల తర్వాత చర్య తీసుకున్నారు. 2.66 కోట్ల పర్యావరణ పరిహారం డిమాండ్ చేస్తూ ఐదుగురు నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. అనుమతి లేకుండా మామిడి చెట్లను నరికివేసినందుకు ఉత్తరప్రదేశ్లో ఇంత భారీ జరిమానా విధించడం ఇదే మొదటిసారి. ఈ కేసు మొదటి విచారణ 20 మే 2025న జరుగనుంది.
వాస్తవానికి, నవంబర్ 17, 2019న యూసుఫ్పూర్ హమీద్ గ్రామంలోని బ్రజ్పాల్ సింగ్ పొలంలో 17 మామిడి చెట్లను అక్రమంగా నరికివేస్తున్నట్లు అటవీ శాఖ బృందానికి సమాచారం అందింది. దాడి సమయంలో, అటవీశాఖ అధికారుల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా చెట్లను నరికివేస్తున్నారని.. వాటి కలపను ట్రాక్టర్లో లోడ్ చేస్తున్నట్లు బృందం కనుగొంది. ఆ బృందం వెంటనే ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ వృక్ష సంరక్షణ చట్టం కింద ఈ కేసులో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నోటీసు పంపినా కోర్టుకు హాజరు కాలేదు.
ఈ కేసులో బ్రజ్పాల్ సింగ్, మజర్, యామిన్, తహజీబ్, షాహిద్లు నిందితులుగా ఉన్నారు. మార్చి 17వ తేదీ, 2025న, నిందితులు కోర్టు హజరు కావాలని.. మీ పక్ష వాదనని వినిపించమని పోస్ట్ ద్వారా నోటీసు పంపించారు. అయినా సరే నిందుతులు కోర్టుకు హాజరు కాలేదు. దీని ఆధారంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని అటవీ శాఖ భావించింది.
నరికివేయబడిన చెట్ల వయస్సు 15 సంవత్సరాలు.
నరికివేయబడిన చెట్ల వయస్సు దాదాపు 15 సంవత్సరాలు అని దర్యాప్తులో తేలింది. సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ కమిటీ ప్రమాణాల ప్రకారం ఒక చెట్టును నరికివేయడం వల్ల సంవత్సరానికి రూ.74,500 విలువైన పర్యావరణ నష్టం జరుగుతుంది. దీని ప్రకారం 17 చెట్లను నరికివేయడం వల్ల మొత్తం నష్టం రూ.2,65,96,500గా అంచనా వేయబడింది. దీనితో పాటు అటవీ శాఖ అదనంగా రూ. 85,000 జరిమానా కూడా విధించింది. ఐదుగురు నిందితులపై రూ.2,66,81,500 (2.66 కోట్లు) జరిమానా విధించాలని సిఫార్సు చేస్తూ అటవీ శాఖ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు మొదటి విచారణ 20 మే 2025న జరుగనుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..