Viral: ఆలయ హుండీ లెక్కింపు.. ఏదో తేడాగా కనిపించిన వెండి నాణేలు.. పరిశీలించి చూడగా
ఆలయం హుండీకి వచ్చిన డబ్బును లెక్కేసిన అధికారులకు షాక్ తగిలింది. నాణేలు కరిగిద్దామని మింట్కు పంపగా అసలు రంగు బయటపడింది. అది చూసి నివ్వెరపోయిన అధికారులు ఆ తర్వాత ఏం జరిగిందంటే.? ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. ఇదిగో వివరాలు..

భక్తిని కూడా వ్యాపారంగా మార్చేస్తూ, ఏకంగా అమ్మవారినే మోసం చేసే స్థాయికి దిగజారిపోయారు కొందరు కేటుగాళ్లు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన జమ్మూకశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయంలో వెలుగుచూసిన ఈ ఘరానా మోసం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. భక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించిన వెండి కానుకల్లో అత్యధిక భాగం నకిలీవని తేలడంతో ఆలయ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. త్రికూట పర్వతాలపై కొలువైన వైష్ణోదేవికి వెండి నాణేలు సమర్పిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకాన్నే ఆసరాగా చేసుకున్న కత్రాలోని స్థానిక వ్యాపారులు, కాడ్మియం, ఇనుము, జింక్ వంటి చౌకబారు లోహాలపై కేవలం వెండి కోటింగ్ వేసి అమ్మేస్తున్నారు. భక్తులు వాటిని అసలైన వెండిగా భావించి కొనుగోలు చేసి అమ్మవారికి మొక్కులుగా సమర్పిస్తున్నారు. అయితే, ఏళ్ల తరబడి పోగుపడిన దాదాపు 20 టన్నుల వెండిని కరిగించి విక్రయిద్దామని ఢిల్లీలోని మింట్కు పంపగా అసలు రంగు బయటపడింది.
రూ. 550 కోట్లు అనుకుంటే.. వచ్చింది రూ. 30 కోట్లే!
మింట్ అధికారులు పరీక్షించిన నాణేలలో 95 శాతం నకిలీవని, కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమే వెండి ఉందని తేల్చారు. ఈ లెక్కన అమ్మవారికి రావాల్సిన రూ. 550 కోట్ల ఆదాయం కాస్తా కేవలం రూ. 30 కోట్లకు పడిపోయింది. పవిత్రమైన పుణ్యక్షేత్రం చుట్టూ ఇన్నాళ్లుగా ఇంత పెద్ద మోసం జరుగుతున్నా ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆలయ బోర్డు అధికారులు ఈ నకిలీ నాణేల అమ్మకాలపై విచారణను ముమ్మరం చేశారు. భక్తులు కూడా ఇలాంటి నకిలీ నాణేల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..
