
ముంబై నగరంలో ఉద్యోగం చేయడం ఒక ఎత్తైతే, అక్కడి ప్రయాణం మరో ఎత్తు. కలల నగరంగా పిలిచే ముంబైలో జీవనం సాగించడం ఎంత కష్టమో నెలకు రూ. 35,000 జీతం పొందే ఒక ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కథనం స్పష్టం చేస్తోంది. ప్రతిరోజూ రానూపోనూ 6 గంటల పాటు ప్రయాణంలోనే గడుపుతున్నానని, తనకు జీవితంలో ప్రశాంతత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సదరు ఉద్యోగి రెడ్డిట్ లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. అతడు ముంబైలోని బద్లాపూర్ నుండి గోరేగావ్ వరకు రోజువారీ ప్రయాణం చేస్తుంటాడు. అతడి రోజువారీ షెడ్యూల్ తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 6:30 గంటలకు ఇంట్లోంచి బయలుదేరి, 7:15 గంటలకు బద్లాపూర్ స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కి దాదర్ చేరుకుంటాడు. అక్కడ వెస్ట్రన్ లైన్ ట్రైన్ మారి గోరేగావ్ వెళ్తాడు. ఆపై ఆఫీసు చేరుకోవడానికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు షేర్ ఆటో క్యూలో నిలబడవలసి వస్తుంది.
ఉదయం 10 గంటలకు ఆఫీస్కు చేరుకుని, రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాడు. ఆ తర్వాత మళ్లీ అదే సుదీర్ఘ ప్రయాణం చేసి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకుంటాడు. వారంలో ఆరు రోజులు ఇదే నరకప్రయాణం సాగుతుందని, ఆదివారం ఒక్కరోజే తనకు సెలవు అని పేర్కొన్నాడు. నేను ఇంటికి కేవలం రాత్రి పడుకోవడానికి మాత్రమే వస్తున్నాను అని అతడు రాసుకొచ్చాడు.
ప్రయాణ భారం తగ్గించుకోవడానికి ఆఫీస్ సమీపంలో పీజీ ఎందుకు తీసుకోకూడదు? అని చాలామంది ప్రశ్నించగా.. తన ఆర్థిక పరిమితులను వివరించాడు. రూ. 35,000 జీతంతో గోరేగావ్ పరిసర ప్రాంతాల్లో పీజీల అద్దెలు చాలా ఖరీదైనవని, చౌకగా లభించే పీజీల్లో కనీస పరిశుభ్రత కూడా ఉండదని తెలిపాడు. దాంతో రోజుకు 6 గంటలు ప్రయాణించక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
I travel for 6 hours everyday from Badlapur to Goregaon
by
u/underground-chicken in
mumbai
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇది ప్రయాణం కాదు, ఒక రకమైన శారీరక, మానసిక వేధింపు అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు వారాంతాల్లో ఉండిపోయేందుకు చౌకైన హాస్టళ్లు వెతుక్కోవాలని లేదా ఉద్యోగం మారడానికి ప్రయత్నించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మెట్రో నగరాల్లో పెరిగిన అద్దెలు, స్థిరంగా ఉన్న జీతాల మధ్య నలిగిపోతున్న సాధారణ ఉద్యోగుల పరిస్థితికి ఈ కథనం నిదర్శనంగా నిలిచింది.