
మన చిన్నతనం నుండి భూమిపై అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని చదువుకున్నాం. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతీ పర్వతారోహకుడి కల. కానీ, భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం, పర్వతం ఎత్తును కొలిచే కొలమానాన్ని బట్టి ఈ విజేత మారుతారు. సముద్ర మట్టం నుంచి చూస్తే ఎవరెస్ట్ మొదటి స్థానంలో నిలిచినప్పటికీ, పర్వతం పునాది నుండి శిఖరం వరకు లెక్కిస్తే మాత్రం హవాయిలోని మౌనా కియా పర్వతమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా నిలుస్తుంది.
మౌనా కియా అనేది హవాయి ద్వీపంలో ఉన్న ఒక సుప్తావస్థలో ఉన్న అగ్నిపర్వతం. స్థానిక భాషలో మౌనా కియా అంటే తెల్లని పర్వతం అని అర్థం. దీని ఎత్తు సముద్ర మట్టం పైకి 4,207 మీటర్లు అంటే..13,803 అడుగులు. సముద్రం లోపల ఉన్న భాగం.. దాదాపు 6,000 మీటర్లకు పైగా పసిఫిక్ మహాసముద్రం అడుగున మునిగి ఉంది. కాగా, మొత్తం ఎత్తు 10,205 మీటర్లు (33,481 అడుగులు).
మరోవైపు, మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి 8,848.86 మీటర్ల (29,031 అడుగులు) ఎత్తులో ఉంది. అంటే పునాది నుండి కొలిచినప్పుడు మౌనా కియా పర్వతం ఎవరెస్ట్ కంటే దాదాపు 1.4 కిలోమీటర్లు ఎత్తు ఎక్కువ!
మౌంట్ ఎవరెస్ట్ హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగం. అది ఇప్పటికే సముద్ర మట్టానికి వేలాది మీటర్ల ఎత్తులో ఉన్న నేల పై నిర్మితమైంది. కానీ మౌనా కియా పర్వతం నేరుగా సముద్ర గర్భం నుండి రూపుదిద్దుకుంది. దీని సగానికి పైగా భాగం నీటి అడుగునే దాగి ఉంది.
మౌనా కియా శిఖరం సముద్ర మట్టానికి పైకి పొడి వాతావరణం, తక్కువ తేమ, కాలుష్యం లేని ఆకాశాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన ఖగోళ టెలిస్కోప్లను ఇక్కడే ఏర్పాటు చేశారు.
భూమి కేంద్రం నుండి చూస్తే ఈక్వెడార్లోని చింబోరాజో పర్వతం అత్యంత దూరంలో ఉన్న శిఖరంగా నిలుస్తుంది. ఇలా కొలిచే విధానాన్ని బట్టి ప్రపంచంలో ఎత్తైన పర్వతాల పేర్లు మారుతుంటాయి. కానీ, భూమిపై పునాది నుండి శిఖరం వరకు అత్యంత పొడవైన పర్వతం మాత్రం నిస్సందేహంగా మౌనా కియానే.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..