Telangana: గోదావరి ఒడ్డున కలకలం.. తాంత్రిక పూజలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు..

|

Oct 03, 2023 | 10:05 AM

Telangana:  మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు మృతి కలకలం రేపుతోంది. ఆరోగ్యం బాగాలేదనే కారణంతో గోదావరి ఒడ్డున తాంత్రిక పూజలు నిర్వహిస్తుండగా అక్కడే ప్రాణాలు కోల్పవడం షాకింగ్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచమంతా కంప్యూటర్‌ వేగంతో దుసుకుపోతుంటే ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాల నుంచి బయటకు రావడం లేదు.

Telangana: గోదావరి ఒడ్డున కలకలం.. తాంత్రిక పూజలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు..
Mancherial
Follow us on

Mancherial, October 03: మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు మృతి కలకలం రేపుతోంది. ఆరోగ్యం బాగాలేదనే కారణంతో గోదావరి ఒడ్డున తాంత్రిక పూజలు నిర్వహిస్తుండగా అక్కడే ప్రాణాలు కోల్పవడం షాకింగ్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచమంతా కంప్యూటర్‌ వేగంతో దుసుకుపోతుంటే ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాల నుంచి బయటకు రావడం లేదు. గడప వద్దే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నా మూఢనమ్మకాల్లోనే మగ్గిపోతున్నారు. దాంతో.. కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు అమాయకులు. తాజాగా.. మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. చెన్నూరు పట్టణం బొక్కలగుట్ట కాలనీకి చెందిన దాసరి మధు అనే యువకుడికి కొన్ని రోజులుగా హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి.

అయితే.. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ఏమాత్రం ఉపశమనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మంత్రాలు, తంత్రాల వైపు ఆలోచన చేశారు. మూఢనమ్మకాలను బాగా నమ్మే కొందరు జనం.. మధు ఆరోగ్యంపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే.. ఆ యువకుడికి ఎవరో ఏదో చేశారని.. మంత్రం వేశారని ఆరోపిస్తూ అతని ప్రాణాల మీదికి తెచ్చారు కుటుంబ సభ్యులు. అంతే సంగతులు.. యువకుడి ఆరోగ్యం విషయంలో వారిలో వారే మూఢనమ్మకాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. అనుమానాన్ని పెంచి పోషించారు. అనారోగ్యంతో ఉన్న అతణ్ని తాంత్రిక పూజల కోసం గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. నగ్నంగా రకరకాల పూజలు చేసిన మాంత్రికుడు.. యువకుడ్ని కూర్చోబెట్టి.. దూపం వేస్తూ తాంత్రిక పూజలు నిర్వహించాడు.

దాంతో… అనుకోని పరిస్థితుల్లో పూజలు కొనసాగుతుండగానే ఆ యువకుడు చనిపోవడం కలకలం రేపింది. అయితే.. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్‌ రివర్స్‌ అయింది. అంత్యక్రియలను అడ్డుకొని అక్కడే పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. యువకుడి మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తాంత్రిక పూజల్లో భాగంగా వేసిన పొగతో ఊపిరాడకపోవడంతోనే యువకుడు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు వైద్యులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..