ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయం… రకరకాలుగా రంగులు మారుతోంది. ప్రధాన పార్టీల నాయకులు చేస్తున్న కామెంట్సు… కాక రేపుతున్నాయ్. తాజాగా తెలంగాణ జనసమితి నేత, ప్రొఫెసర్ కోదండారమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయ్. ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయంటూ.. టీవీ9 బిగ్న్యూస్ బిగ్డిబేట్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్. ఆ వేదిక కోసం పలు ఆప్షన్స్ కూడా ఇచ్చారు కోదండరాం. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులంతా ఒకే వేదికపైకి రావడం ఒక ఆప్షనైతే… రెండు మూడు వేదికల ద్వారా సమన్వయం సాధించడం మరో ఆప్షన్గా సూచించారు కోదండరాం.
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయం.. వినూత్నమైన టర్న్ తీసుకుందనే చెప్పాలి. బీఆర్ఎస్కు బైబై చెప్పేసిన పొంగులేటి, జూపల్లి వంటి నేతలు.. ఏ పార్టీలో చేరతానే విషయమై ఉత్కంఠ కొనసాగుతుండగా.. అది మరింత సస్పెన్స్ గా మారింది. చాలారోజులుగా వీరితో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్… సడెన్గా వారి గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద కుదుపునకే కారణమయ్యాయ్. జూపల్లి, పొంగులేటి.. బీజేపీలో చేరేలా లేరనీ.. తననే పార్టీలోంచి బయటకు రావాలంటూ రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారనీ… ఈటల చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయ్యాయ్. నిజంగానే రాష్ట్రంలో బీజేపీ డీలా పడిందా? అనే సందేహాలు మొదలయ్యాయ్. బిగ్డిబేట్లో ప్రొఫెసర్ కోదండారం సైతం.. అదే అనుమానాన్ని వ్యక్తం చేయడం విశేషం.
అయితే, ఎవ్వరు కలిసొచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్కు, కేసీఆర్కు ఎదురు లేదంటున్నారు మంత్రి హరీశ్రావు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి.. ఈటల రాజేందర్ మాటల్లోనే అర్థమవుతోందంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు హరీశ్.
మొత్తానికి తెలంగాణ రాజకీయం సెగలు గక్కుతోంది. ఏ గట్టున ఎవరుంటారో? ఎవరు ఎవరితో జతకలుస్తారో? తెలియదుగాని, ఎన్నిలకు చాన్నాళ్ల ముందు నుంచే పార్టీల మధ్య పాచికలాట మొదలైనట్టు కనిపిస్తోంది. మరి, దీంట్లో ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి అని నిర్ణయించాల్సింది ప్రజలే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..