AP-Telangana Rains: గ్యాప్ లేదు.. మరో 48 గంటలు దంచుడే.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్.. టేక్ కేర్

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ముసురుపట్టగా... మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడ్రోజులుగా పలుజిల్లాల్లో కురిసిన ఏకధాటి వానలకు... పల్లెలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

AP-Telangana Rains: గ్యాప్ లేదు.. మరో 48 గంటలు దంచుడే.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్.. టేక్ కేర్
Ap Weather Alert

Updated on: Jul 11, 2022 | 5:27 PM

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన… ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అటు వరుసగా నాలుగో రోజూ వర్షం దంచికొడుతూనే ఉంది. దీంతో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజల్ని అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. భారీ వర్షాలకు గోదావరి అనేక చోట్ల ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా(mulugu district) ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. 16.14 మీటర్ల నీటిమట్టం నమోదైంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ముంపు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏకంగా 10 సెం.మీ. వర్షం కురవడంతో ఏటూరునాగరం ITDA దగ్గర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరిలో 53 అడుగులకు చేరింది నీటిమట్టం. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం ఓ రేంజ్‌లో వుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం యత్నారం గ్రామం చుట్టూ నీరు చేరింది. ఊరు మొత్తం మునక బారిన పడింది. గ్రామస్తులంతా మరో మార్గం లేక బతుకు జీవుడా అంటూ అడవి బాట పట్టారు. అడవిలో కవర్లతో గుడిసెలు వేసుకుని క్షణమొక యుగంలా గడుపుతున్నారు జనం. వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. గోదావరిలో వరద పరిస్థితి, నదీ ప్రవాహం, ఉపనదుల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి.. ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

అటు… ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరింది. 50 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 42039 క్యూసెక్కులకు చేరింది. బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించొద్దని హెచ్చరించారు. నదుల్లో స్నానాలు, చేపలవేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోరారు.  జులైలో రికార్డు స్థాయిలో గోదావరికి వరద నీరు చేరుతోంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి ఉంచారు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి 9లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. గంటగంటకు పెరుగుతున్న వరద ప్రవాహం కారణంగా ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. ఏలూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దాచారం – కుక్కునూరు మధ్య గుండేటి వాగు కల్వర్ట్ మునిగిపోయింది. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

కోనసీమకు వరద ముంచెత్తుతోంది. కాజ్‌వేలు, లంక గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వరద ప్రవాహానికి నదీపాయ రహదారులు తెలిగిపోయాయి. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం-కోటిపల్లి రేవులో వరద ఉధృతికి రహదారి కొట్టుకుపోయింది. దీంతో ముక్తేశ్వరం-కోటిపల్లి రేవులో పంటు ప్రయాణాలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లా అన్నవరం వాగులో వంతెన కొట్టుకుపోయింది. కూనవరం దగ్గర 51 అడుగులకి చేరింది వరద నీటిమట్టం . శబరి, గోదావరి నదులకి క్రమ క్రమంగా వరద పోటెత్తుతోంది. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సముద్రం.. పది కిలోమీటర్ల లోపల మత్స్యకారులు చిక్కుకుపోయారు. కాకినాడ నుంచి రెండు బోట్లలో వేటకు వెళ్లారు 16మంది మత్స్యకారులు. సముద్రం మధ్యలో సాంకేతిక లోపంతో బోట్లు నిలిచిపోయాయి. వర్షం నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు చేసింది. గోదావరికి వరద ఉధృతి పెరగడంతో ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌, మూడు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపింది. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వెదర్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us