Telangana: ఇది కధ కాదు వ్యధ.. మాతృదేవోభవ సినిమాని తలపిస్తున్న చిన్నారుల జీవితం.. ఆదుకోవాలని విజ్ఞప్తి..
స్పందించే హృదయం కోసం రెండు జీవితాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు... ఇక సమాజమే తమకు అమ్మానాన్న అంటున్నారు. చదువుకోవాలని వుంది... మీ బిడ్డలుగా భావించి సాయం చేస్తారా...! అని అడుగుతోన్న ఆ చిన్నారులను చూస్తే గుండెకన్నీరవుతుంది ఎవరికైనా.
Updated on: Nov 04, 2024 | 8:09 AM

దీపావళి పిల్లలు పెద్దలందరికీ సంతోషాలనిచ్చింది. అయితే జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఇద్దరు చిన్నారులకు మాత్రం వెలుగుపూల పండుగ మాతృదేవో భవ సినిమాలా చీకట్లను మిగిల్చింది. మాతృదేవో భవ... ఔను.. నిజంగా ఈ ఇద్దరు చిన్నారులదీ అదే కథ. అంతకు మించిన వ్యథ.

ఆరేళ్ల కిందట తండ్రి రెడ్డిమల్ల నరేష్ చనిపోయారు. చిన్నరేకుల గూడు తప్ప ఇల్లు వాకిలి కూడా లేదు. కాయం కష్టం చేస్తూ బిడ్డలిద్దర్నీ సాకింది శారదమ్మ. కానీ కటిక పేదరికాన్ని కాలం మరోసారి పరిహాసం చేసింది. కిడ్నీ జబ్బుతో మంచాన పడిన శారద..వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇటీవలే కన్నుమూసింది. ఊళ్లో వాళ్లే తలో చెయ్యేసి అంత్యక్రియలు చేశారు. పది దినాలు కూడా చేసే పరిస్థితి లేదు. ఈ బిడ్డల భవిష్యత్ ఏంటని ఓ అమ్మ గుండె కన్నీరైందిలా..

కంటేనే అమ్మ అని అంటే ఎలా? ఇలాంటి మంచి మనసున్న ప్రతీ ఒక్కరూ వర్షిత్, శ్రీవల్లిలకు అమ్మానాన్నలే. ఈ బిడ్డలు అనాథలు కాదు..అందరి బంధువులంటూ అక్కున చేర్చుకుంది వావిలాల గ్రామం.మహత్మా గాంధీ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గంటా రవీందర్..ఇద్దరు చిన్నారులకు పదివేల ఆర్ధిక సాయం అందించారు.

అమ్మానాన్న లేరు. ఇల్లు లేదు. ఇక చెల్లె బాధ్యత నాదే. అమ్మమ్మ తాతయ్య నానమ్మ వున్నారు. కానీ వాళ్లకే ఓ దరి లేదు. ఇక మాకు బతుకు దారేది? చదువుకోవాలనుంది మీ బిడ్డగా భావించి సాయం చేయండన్న వర్షిత్ మాటలు వింటే...ప్చ్ ఏం చెప్పగలమ్..కన్నీరాగదు

ఉండడానికి ఇల్లు వాకిలి లేని దైన్యంలో తాటాకులతో ఓ గూడు వేసుకొని అమ్మకు దశ దిన కర్మ చేస్తున్నారు వర్షిత్,శ్రీ వల్లి. వావిలాల గ్రామస్థులు వారికి అండగా వున్నారు. కానీ ఆసరా ఎంతకాలం? ఏ దిక్కులేని ఈ బిడ్డలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు. మనసున్న దాతలు ఎవరైనా స్పందించి వర్షిత్, శ్రీ వల్లికి దారి చూపాలని వేడుకుంటున్నారు.





























