
ఈ ప్రపంచలోకెళ్లా విశ్వాసమైన జీవి ఏదైనా ఉదంటే.. అది శునకం మాత్రమేనని ఓ కుక్క మరోసారి నిరూపించింది. తన ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా ఓ శునకం హనుమాన్ భక్తుల వెంబడి ఏకంగా 136 కిలో మీటర్లు నడిచి వారికి రక్షణ కల్పించింది. భక్తికి, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ శునకానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరుకు చెందిన కొందరు హనుమాన్ స్వాములు కొండగట్టుకు పాదయాత్రను ప్రారంభించారు. అయితే వారికి మార్గ మధ్యలో ఆకలితో ఉన్న ఓ శునకం కనిపించింది. ఆకలి, ఎండ వేడితో నీరసించి పోయినా ఆ శునకాన్ని చూసిన హనుమాన్ భక్తులు చలించిపోయి.. పక్కనే ఉన్న ఓ షాపులో ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొని దానికి ఆహారంగా వేశారు. అంతే అప్పటి నుంచి ఆ శునకం వారి వెంటే నడిచింది, ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా కొండగట్టు క్షేత్రం వరకు సాగే ఆ స్వాముల పాదయాత్రలో పాల్గొంది. దాదాపు ఇప్పటి వరకు అది 130 కిలో మీట్లర్లకు పైగా తమ వెంట నడిచినట్టు హనుమాన్ భక్తులు చెబుతున్నారు.
అయితే ఈ పాదయాత్రలో భాగంగా ఎండకు తార్ రోడ్డుపై నడవడం వల్ల శునకం కాళ్లు కందిపోయినా, అది వెనక్కి తగ్గలేదు. అవేవి లెక్కచేయకుండా హనుమాన్ స్వాముల వెంబడి ముందుకు సాగింది, వారే తమ యజమానులని భావించి వారికి రక్షణగా రాత్రింభవళ్లు నడిచింది. ఈ శునకం ఉందన్న ధైర్యంతో అటవిప్రాంతంలో సైతా స్వాములు నిర్భయంగా ముందుకు సాగారు. అంతేకాదు తమ వెంట నడవడంతో కందిపోయిన శునకం కాళ్లకు సాక్స్లు తొడిగి స్వాములు సైతం తమ ప్రేమను పంచుకున్నారు. ఈ మూగజీవి చూపిన ప్రేమకు భక్తులతో పాటు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఇది కదా నిజమైన విశ్వాసమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.