Vijayadashami: దసరా ఎప్పుడు జరుపుకోవాలి? ఈ నెల 23న లేక 24వ తేదీనా?
రెండు డేట్లు...రెండు డౌట్లు. ఇప్పుడు ఏ పండుగ వచ్చినా పరేషాన్ మొదలవుతోంది. ఏ రోజు జరుపుకోవాలి అనే అనుమానాలతో జనం సతమతమై పోతున్నారు. దీనికి పరిష్కారం చూపించాల్సిన పండితులు..ఆ కన్ఫ్యూజన్ను ఇంకాస్త పెంచుతున్నారు. వాళ్లు కూడా రెండు వాదనలు వినిపిస్తుండడంతో, ఒక పండుగ రెండు తేదీల మధ్య జనం నలిగిపోతున్నారు. ఇప్పుడు లేటెస్టుగా జనానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. ఇంతకీ దసరా ఎప్పుడు జరుపుకోవాలి? ఈ నెల 23న లేక 24వ తేదీనా?

డబుల్ ధమాకా లాగా….ఇప్పుడు పండుగలను డబుల్ ట్రబుల్ వెంటాడుతోంది. ఆ మధ్య రాఖీ తేదీలపై డౌటనుమానాలతో జనం బాగా ఇబ్బందులు పడ్డారు. ఏ రోజు రాఖీ కట్టాలో తెలియక, పండుగ జరుపుకోవాలో తెలియక సతమతమైపోయారు. ఆ తర్వాత వినాయక చవితికి కూడా సేమ్ టు సేమ్ కన్ఫ్యూజన్. ఇక పండితులు కూడా తమ పాండిత్య ప్రదర్శన, జ్ఞానం విజ్ఞానంతో ఆ కన్ఫ్యూజన్ని మరింత పెంచేస్తున్నారు. దీంతో ఇప్పుడు పండుగ వస్తే పరేషాన్ అయిపోతున్నారు జనం. ఏ తేదీన జరుపుకోవాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.
దసరా ఎప్పుడు? 23న లేక 24న?
ఇప్పుడు దసరా డేట్ మీద కూడా డౌట్ మొదలైంది. ఒక పండుగ రెండు తేదీల మీమాంసతో జనం మళ్లీ తర్జనభర్జన పడుతున్నారు. ఈ నెల 23న విజయదశమి జరుపుకోవాలా లేక 24న జరుపుకోవాలా అనే అనుమానం పెనుభూతంలా మారి భక్తులను తెగ కలవరపెడుతోంది. ఈసారి దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనేదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 23న జరుపుకోవాలా లేక 24న జరుపుకోవాలా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధర్మంపై ధర్మ, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి రోజు ప్రసిద్ధి చెందింది. అయితే అదెప్పుడు అనేదానిపై క్లారిటీ రాక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు విజయదశమి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, విజయదశమి రోజున దుర్గా మాత… మహిషాసురుడిని వధించిందని ఒక కథనం చెబుతుంది. మరో కథనంలో రావణుడిని చంపి సీతమ్మను రాక్షసుల చెర నుంచి విడిపించి రాములవారు అయోధ్యకు తిరిగివస్తారు. దీనికి ప్రతీకగా ఉత్తరాదిన విజయదశమి నాడు రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. అయితే పంచాంగం ప్రకారం అశ్వయుజ శుక్ల పక్ష దశమి తిథి సోమవారం, అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభమవుతుంది. మంగళవారం, అక్టోబర్ 24 మధ్యాహ్నం 03:14 గంటలకు ముగుస్తుంది. రెండు రోజులు దశమి తిథి ఉండడంతో దసరాపై సందిగ్ధత నెలకొంది. కొందరు పండితులు ఈ నెల 23న దసరా జరుపుకోవాలని సూచిస్తున్నారు. మరికొందరు పండితులు మాత్రం 24వ తేదీన విజయదశమి జరుపుకోవాలంటున్నారు.
ఈ నెల 23నే విజయదశమి జరుపుకోవాలంటూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శృంగేరి పీఠం సూచింది. ఇక తెలంగాణ విద్వత్ సభ కూడా ఈ నెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో దసరా సెలవును అక్టోబర్ 23కు మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పండితులు ఎంత చెప్పినా…వాట్సప్ యూనివర్సిటీలు, సోషల్ మీడియా కాలేజీలు..ఒక దసరా-రెండు తేదీల కన్ఫ్యూజన్ను ఇంకా కొనసాగేలా చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




